Bangladesh: గంటలో రిజైన్ చేశావా సరి లేదా.. బంగ్లాదేశ్ సీజేకు ఆందోళనకారుల అల్టిమేటం

Protesters Ultimatum To Bangladesh Chief Justice

  • ఢాకాలోని సుప్రీంకోర్టు బిల్డింగ్ ను చుట్టుముట్టిన నిరసనకారులు
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ రాజీనామా చేయాలని డిమాండ్
  • కొత్త ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా సీజేఐ మీటింగ్ ఏర్పాటు చేయడంపై ఆగ్రహం

బంగ్లాదేశ్ లో ఆందోళనకారులు మరోమారు రోడ్లపైకి వచ్చారు. శనివారం ఢాకాలోని సుప్రీంకోర్టు బిల్డింగ్ ను చుట్టుముట్టారు. ప్రధాన న్యాయమూర్తి అబైదుల్ హసన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గంటలోగా రాజీనామా చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. చీఫ్ జస్టిస్ హసన్ తో పాటు ప్రస్తుతం పదవిలో ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ వెంటనే రాజీనామా చేయాలని అల్టిమేటం జారీచేశారు. జడ్జిలు పారిపోకుండా సుప్రీంకోర్టు భవన సముదాయాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టారు.

షేక్ హసీనా రాజీనామా తర్వాత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ఆందోళనలు కొద్దిగా చల్లారాయి. రోడ్లపై ఆందోళన చేస్తున్న యువత కాస్త నెమ్మదించింది. కొత్త ప్రభుత్వం సాఫీగా నడిచేందుకు సహకరించాలని నిర్ణయించింది. అయితే, ఈ కొత్త ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ హసన్ శనివారం జడ్జిలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడంతో ఆందోళనకారులు మరోసారి ఆగ్రహావేశాలకు లోనయ్యారు.

ఢాకాలోని సుప్రీంకోర్టు బిల్డింగ్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. లోపల జరుగుతున్న జడ్జిల మీటింగ్ ను వెంటనే ఆపేసి, చీఫ్ జస్టిస్ సహా న్యాయమూర్తులంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆవరణలో నినాదాలు చేస్తూ రాజీనామా చేయడం మినహా జడ్జిలకు మరో మార్గంలేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు. హసీనా ప్రభుత్వంలో జరిగిన కుట్రలో సుప్రీంకోర్టుకు కూడా భాగముందని వారు ఆరోపించారు. ప్రస్తుత జడ్జిలు అందరూ ఆ కుట్రలో పాల్గొన్నారని, వారంతా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News