Bangladesh: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్ సహా తెలంగాణకు అక్రమ వలసలు.. అప్రమత్తమైన పోలీసులు!

Bangladesh people in Telangana

  • ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లోకి వచ్చేందుకు బంగ్లాదేశీయుల ప్రయత్నాలు
  • హైదరాబాద్‌కు కూడా వస్తున్నట్లు పోలీసులకు సమాచారం  
  • బాలాపూర్, కాటేదాన్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో పోలీసుల గాలింపు

బంగ్లాదేశ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశానికి చెందినవారు చాలామంది హైదరాబాద్ నగరంలోకి ప్రవేశిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి వచ్చేందుకు సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఆ దేశీయులు ఉన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో బంగ్లా జాతీయులు హైదరాబాద్‌కు కూడా వస్తున్నారని సమాచారం వచ్చింది.

దీంతో పోలీసులు బాలాపూర్, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో బుధవారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో రోహింగ్యాలు, బంగ్లాదేశ్‌కు చెందినవారు పెద్ద ఎత్తున నగరానికి వచ్చి చిరు వ్యాపారులుగా, పరిశ్రమలు, భవన కార్మికులుగా పని చేస్తున్నారు.

ఇందులో కొంతమంది వీలు చిక్కినప్పుడల్లా బంగ్లాదేశ్‌కు వెళ్లి వస్తున్నట్లుగా గుర్తించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల వారి రాకపోకలు ఎక్కువ అయ్యాయని, దీంతో అప్రమత్తమైనట్లు వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాలకు చాలాకాలంగా బంగ్లాదేశ్ నుంచి పలువురు అక్రమంగా వలస వస్తున్నారు. రెండు నెలల క్రితం కోల్‌కతా మీదుగా ఖమ్మంకు ఐదుగురు బంగ్లాదేశ్ మైనర్లు వచ్చారు. బాల కార్మికులను గుర్తించే క్రమంలో... పోలీసులు ఖమ్మంలో తనిఖీలు చేపట్టారు. బంగ్లా నుంచి వచ్చి భవన నిర్మాణ కార్మికులుగా చేస్తున్న పిల్లల్ని గుర్తించారు. సికింద్రాబాద్‌లోనూ మరో ఐదుగురిని గుర్తించారు.

  • Loading...

More Telugu News