S Jaishankar: బంగ్లాదేశ్‌లోని భార‌తీయుల‌తో ట‌చ్‌లోనే ఉన్నాం: మంత్రి జైశంక‌ర్‌

We Are In Close Touch With Indian Community In Bangladesh says S Jaishankar

  • బంగ్లాదేశ్‌లో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు
  • ఆ దేశంలోని భార‌తీయుల భ‌ద్ర‌త‌ ప‌ట్ల ఆందోళ‌న
  • ఈ నేప‌థ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
  • అక్క‌డ ఉంటున్న సుమారు 19 వేల మందితో ట‌చ్‌లోనే ఉన్న‌ట్లు వెల్ల‌డి

బంగ్లాదేశ్‌లో నెల‌కొన్న అనిశ్చితి కార‌ణంగా ఆ దేశంలో ఉంటున్న భార‌తీయుల భ‌ద్ర‌త‌ ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం అవుతున్న వేళ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం మధ్యాహ్నం పార్లమెంటులో మాట్లాడారు. బంగ్లాదేశ్ లో ఉంటున్న సుమారు 19,000 మందితో ట‌చ్‌లోనే ఉన్న‌ట్లు తెలిపారు. 

బంగ్లాదేశ్‌లో రిజ‌ర్వేష‌న్ల కోటాకు వ్య‌తిరేకంగా చెల‌రేగిన హింసాకాండ‌లో ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 400మంది ప్రాణాలు కోల్పోయారు. నిర‌స‌న‌కారులు ప్ర‌ధాని షేక్ హ‌సీనా రాజీమానాకు ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఆమె త‌న ప‌ద‌వికి రిజైన్ చేశారు. ఇక ఢాకా స‌హా ఇతర ప్రాంతాల‌లో ఉండే భార‌తీయుల‌కు భద్రత కల్పించాలని భారతదేశం ఆశిస్తున్నట్లు జైశంకర్ అన్నారు.

"బంగ్లాదేశ్‌లో పరిస్థితి మారిపోతోంది. ఎంబ‌సీ ద్వారా మేం బంగ్లాదేశ్‌లోని భారతీయ సమాజంతో నిరంతరం ట‌చ్‌లోనే ఉన్నాము. అక్క‌డ‌ సుమారు 19,000 మంది భారతీయ పౌరులు ఉన్నారు. వీరిలో సుమారు 9,000 మంది వ‌ర‌కు విద్యార్థులు ఉన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు జులైలో తిరిగి వచ్చేశారు. గత 24 గంటల్లో మేం ఢాకాలోని అధికారులతో కూడా క్రమం తప్పకుండా టచ్‌లోనే ఉంటున్నాం. అక్కడున్న భారతీయులకు తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నాం" అని విదేశాంగ మంత్రి చెప్పారు.

ఇక ఆ దేశంలోని మైనారిటీల ర‌క్ష‌ణ‌పై (బంగ్లాదేశ్ జనాభాలో 90 శాతానికి పైగా ముస్లింలు) విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. "మేము మైనారిటీలకు సంబంధించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. వారి రక్షణ, శ్రేయస్సు కోసం ప‌లు కార్యక్రమాలు ఉన్నాయి" అని అన్నారు. 

కాగా, భారతదేశ ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్‌తో 4,096 కి.మీ సరిహద్దును పంచుకుంటున్న విష‌యం తెలిసిందే. ఆ దేశంలో ఆందోళనల కారణంగా చొరబాట్లు ఉండొచ్చ‌నే అనుమానంతో మేఘాలయలో 12 గంటల రాత్రి కర్ఫ్యూ విధించ‌డం జరిగింది. అలాగే సరిహద్దు భద్రతా దళాలను హై అలర్ట్‌లో ఉంచారు.

  • Loading...

More Telugu News