Ponguleti Srinivas Reddy: ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు

Ponguleti key orders on lrs

  • ఎల్ఆర్ఎస్ ప్రక్రియ నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉందన్న మంత్రి
  • నిబంధనలకు లోబడి ఎల్ఆర్ఎస్ ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు
  • ఈ సమస్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన మంత్రి

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశం రాష్ట్రంలో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. శనివారం ఆయన భూపాలపల్లిలో పర్యటించారు. అక్కడి కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిబంధనలకు లోబడి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్రమబద్ధీకరించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, వాటిని పరిరక్షించాలన్నారు.

గత ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం 25.70 లక్షల దరఖాస్తులు తీసుకుందని, ఇందులో హెచ్ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీ పరిధిలో 13.69 లక్షలు, గ్రామ పంచాయతీల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ దరఖాస్తుదారులు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారని, కాబట్టి వీటి పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.

నిబంధనలను దృష్టిలో పెట్టుకొని భూముల క్రమబద్ధీకరణలో అక్రమాలకు తావులేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.

  • Loading...

More Telugu News