KTR: ఆర్థిక పరిస్థితి తెలుసు.. రుణమాఫీకి మీరెన్ని తంటాలు పడుతున్నారో కూడా తెలుసు: కేటీఆర్

KTR talks about telangana financial situtation

  • రుణమాఫీకి పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బులు తేవడం కష్టమని తెలుసునన్న కేటీఆర్
  • రాష్ట్రం దివాలా తీసిందని చెప్పుకుంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్న
  • మీరు నిద్రలేని రాత్రులు గడిపి... మాకూ నిద్రలేకుండా చేస్తున్నారని చురక
  • కాంగ్రెస్‌కు కేసీఆర్ ఫోబియా పట్టుకుందని విమర్శ

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తమకు తెలుసునని... రుణమాఫీ చేయడానికి మీరు (కాంగ్రెస్ ప్రభుత్వం) ఎన్ని తంటాలు పడుతున్నారో కూడా తెలుసునని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బుధవారం ద్రవ్య వినిమయ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సిరిగల... లక్ష్మీగల తెలంగాణను దివాలా తీసిందని చెప్పడం ఈ ప్రభుత్వానికి సరికాదన్నారు.

దివాలా తీశామని చెప్పుకుంటే ఎలా?

మన కుటుంబాన్ని, మన వ్యాపారాన్ని మనమే తిట్టుకుంటే ఎలా? అని నిలదీశారు. మా వ్యాపారం దివాలా తీసిందని, మాకు అప్పులు ఉన్నాయని చెబితే పెట్టుబడిదారులు వస్తారా? అని ప్రశ్నించారు. నిధులు అవసరమైతే ఎఫ్ఆర్‌బీఎంను పెంచమని కేంద్రాన్ని అడగాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. నిన్నటి వరకు మేం కూడా అక్కడే (అధికారంలో) ఉన్నాం కాబట్టి అన్ని విషయాలు తెలుసునని... రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలుసునని చెప్పారు. రుణమాఫీ చేయడానికి మీరు కూడా తంటాలు పడుతున్న విషయం తెలుసునన్నారు.

మీరు నిద్రలేని రాత్రులు గడిపి... మాకూ నిద్రలేకుండా చేస్తున్నారు

పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బులు తేవడం ఎంత కష్టమో తమకు తెలుసునని కేటీఆర్ అన్నారు. అర్ధరాత్రి మూడు గంటల వరకు సభను నడిపి మీరు నిద్రలేని రాత్రులు గడుపుతూ.. తమకూ నిద్రలేకుండా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తాము ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. ప్రభుత్వ పెట్టుబడితో పేదలు బాగుపడాలన్నారు. 

కేసీఆర్ ఫోబియా

కానీ వీళ్లతో (కాంగ్రెస్ ప్రభుత్వం) బాధేమిటంటే కేసీఆర్ ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేస్తామని చెబుతుంటారని... కానీ చెరిపివేయలేని, తుడిచివేయలేని... దాచివేయలేనివి కేసీఆర్ ఆనవాళ్లు అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను ఎలా చెరపగలుగుతారు? అని నిలదీశారు. 

'కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్... కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్... భగీరథ నల్లా నీళ్ళలో కేసీఆర్... పాలమూరు జలధారలో కేసీఆర్... సీతారామ ఎత్తిపోతలలో కేసీఆర్... గురుకుల బడిలో కేసీఆర్... యాదాద్రిగుడి యశస్సులో కేసీఆర్... విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్... మెడికల్ కాలేజీ వైద్య, విద్య విప్లవంలో కేసీఆర్... కలెక్టరేట్ల భవనాల కాంతుల్లో కేసీఆర్... కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్‌లో కేసీఆర్... మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్... టీ హబ్, టీ వర్క్స్ సృజనలో కేసీఆర్... వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్... అతిపెద్ద అంబేడ్కర్ మెరుపుల్లో కేసీఆర్... అమరదీపం ఆశయాల్లో కేసీఆర్' అన్నారు.

మధ్యలో శాసన సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ... త్వరగా ముగించాలని కోరారు. కొత్త గవర్నర్ వస్తున్నారని, ఈరోజు ప్రమాణ స్వీకారానికి మనం హాజరు కావాల్సి ఉందని, కాబట్టి త్వరగా ముగించాలని కేటీఆర్‌ను కోరారు.

కేటీఆర్ స్పందిస్తూ... గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అందరం వెళదామని, కానీ ద్రవ్య వినిమయ బిల్లు ముఖ్యమైనది కాబట్టి సభను వాయిదా వేసి, గవర్నర్ ప్రమాణ స్వీకారం తర్వాత తిరిగి ప్రారంభించి అర్ధరాత్రి వరకు నడుపుకుందామన్నారు. అయితే పది నిమిషాల్లో ముగించాలని మంత్రి మరోసారి సూచించారు.

ఎన్నికలకు ముందు రజినీకాంత్... ఎన్నికల తర్వాత గజినీకాంత్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించిందని ఆరోపించారు. తులం బంగారం, స్కూటీ వంటి హామీల పరిస్థితి ఏమిటన్నారు. కోతలు, ఎగవేతలు, కత్తిరింపులతో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరపు ఆర్భాటాలు, దుబారా ఖర్చులు తగ్గించాలని సూచించారు. రుణమాఫీ ఒకే దఫా చేయనప్పటికీ ప్రకటనలు మాత్రం ఇప్పటికి రెండుసార్లు ఇచ్చారని ఆరోపించారు. ఇలాంటి దుబారా ఖర్చును చేయవద్దన్నారు.

ఆరు గ్యారెంటీలు అంటూ బాండ్ పేపర్ పైన సంతకం పెట్టి మరిచిపోయారన్నారు. ఎన్నికలకు ముందు రజినీకాంత్... ఎన్నికల తర్వాత గజినీకాంత్ అంటే ఎలా? అని నిలదీశారు. ప్రభుత్వం డెవలప్‌మెంట్ ఏజెంట్‌గా ఉండాలి తప్ప రికవరీ ఏజెంట్‌లా ఉండవద్దని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతిపక్ష పార్టీగా తాము నిలదీస్తామన్నారు.

ప్రజలకు 2 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వంపై రికవరీ ఛార్జిషీట్ వేయాలన్నారు. ప్రజలకు వీరు 2 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కల్యాణలక్ష్మి ఇస్తే... దానికి తోడు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ హామీని నెరవేర్చలేదన్నారు. ఇస్తామన్న తులం బంగారం ఎక్కడకు పోయిందో చెప్పాలన్నారు. ప్రభుత్వానికి బంగారం దొరకడం లేదా? లేక దేశంలో బంగారం నిల్వలు తగ్గాయా? ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. నెలకు రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, మహిళలు వీటి కోసం ఎదురు చూస్తున్నారన్నారు.

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారని, కానీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఎన్ని ఇచ్చారో చెప్పాలన్నారు. గోబెల్స్‌ను మించి అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు, పరీక్షలు జరిగితే... రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం నియామక పత్రాలు ఇచ్చి 30వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం విడ్డూరమన్నారు.

  • Loading...

More Telugu News