Theft: బస్సు నుంచి రూ. 3 కోట్ల విలువైన బంగారు నగల చోరీ

Theft in private travel bus in Zaheerabad

  • హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు
  • అర్ధరాత్రి సంగారెడ్డి జిల్లా సత్వార్ వద్ద ఆగిన బస్సు
  • ప్రయాణికుల్లా బస్సెక్కి బ్యాగుతో పరారైన దొంగలు

హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రూ. 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగు చోరీకి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరింది. అదే బస్సులో బంగారు నగల వ్యాపారి ఆశిష్ (32) నాలుగు కేజీల నగలతో ముంబైకి వెళ్తున్నాడు. బస్సు అర్ధరాత్రి సత్వార్ వద్ద కోహినూర్ దాబా వద్ద ఆగింది. ప్రయాణికులందరూ దిగారు. సిగరెట్ తాగేందుకు ఆశిష్ కిందికి దిగాడు. తిరిగి బస్సెక్కి చూస్తే ఆభరణాలున్న సంచి కనిపించకపోవడంతో లబోదిబోమన్నాడు. దొంగలు ప్రయాణికుల్లా బస్సెక్కడం, ఆ తర్వాత బ్యాగుతో వెళ్లడం దాబా వదనున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.

చోరీపై అనుమానా లు.. పొంతనలేని వ్యాపారి సమాధానాలు
దాదాపు రూ. 3 కోట్ల విలువైన నగలున్న బ్యాగ్ పోగొట్టుకున్న వ్యాపారి ఫిర్యాదు సమయంలో తడబాటుకు గురికావడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు కిలోల ఆభరణాలు ఎత్తుకెళ్లారని ఒకసారి, మొత్తం బ్యాగునే ఎత్తుకెళ్లారని మరోసారి వ్యాపారి చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఆ నగలకు సంబంధించిన పూర్తి బిల్లు కావాలని కోరడంతో వ్యాపారి హైదరాబాద్ వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, 2019లో ఇదే దాబా వద్ద ఇలానే ఓ వ్యాపారి నుంచి రూ. 1.50 కోట్ల నగదు చోరీ అయింది.

Theft
Sangareddy District
Private Travels Bus
Telangana
  • Loading...

More Telugu News