MK Stalin: ఒంటరి అవుతారు.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర హెచ్చరిక

CM Stalin Warns PM Modi that you will be isolated if you govern according to your political likes and dislikes

  • ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఇలాగే కొనసాగించవద్దంటూ మండిపాటు
  • బడ్జెట్‌లో తమిళనాడుకు కేటాయింపులు లేకపోవడంపై మండిపాటు
  • పార్లమెంట్‌లో ఇండియా కూటమి పార్టీల ఆందోళనకు గొంతు కలిపిన స్టాలిన్
  • ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర హెచ్చరిక చేశారు. పాలనపై దృష్టి సారించడం కంటే ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఇలాగే కొనసాగిస్తే ఒంటరిగా మిగిలిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో ఎన్డీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను విస్మరించారంటూ కేంద్రంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బుధవారం ఎక్స్ వేదికగా స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఎన్నికలు అయిపోయాయని, ఇక దేశం గురించి ఆలోచించాలని హితబోధ చేశారు. ‘‘బడ్జెట్-2024 మీ పాలనను కాపాడుతుంది. కానీ దేశాన్ని రక్షించదు. ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా నడిపించండి. లేదంటే మీరు ఒంటరి అయిపోతారు. మిమ్మల్ని ఓడించిన వారి విషయంలో ఇంకా ప్రతీకారానికి పోవద్దు. మీ రాజకీయ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపిస్తే ఒంటరిగా మిగులుతారు’’ అని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.

కాగా బడ్జెట్ కేటాయింపులను నిరసిస్తూ ఇండియా కూటమి పార్టీలు పార్లమెంట్‌లో ఈ రోజు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ ఆందోళనల్లో భాగస్వామ్య పార్టీ అయిన డీఎంకే ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను స్టాలిన్ షేర్ చేశారు.

  • Loading...

More Telugu News