Sharmila: ఇవి బడ్జెట్ పద్దులా... లేక ఎన్నికల మేనిఫెస్టో హామీలా?: షర్మిల

Sharmila slams Union govt over Budget

  • కేంద్ర బడ్జెట్ పై షర్మిల విమర్శనాస్త్రాలు
  • నిర్దిష్టమైన లెక్కలు, గణాంకాలు లేకుండా తీవ్ర అసంతృప్తికి గురిచేశారని వెల్లడి 
  • ఏపీకి ప్రత్యేక హోదా ఊసే లేదన్న ఏపీ కాంగ్రెస్ చీఫ్
  • ఏపీ ప్రభుత్వం బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని డిమాండ్

ఇవి బడ్జెట్ పద్దులా, లేక ఎన్నికల మేనిఫెస్టో హామీలా? అంటూ కేంద్ర బడ్జెట్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. నిర్దిష్టమైన లెక్కలు లేవు, నెంబర్లు లేవు, కేవలం ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి యావత్ దేశాన్ని, అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను ఎన్డీయే సర్కారు తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని విమర్శించారు. కేంద్రం ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆమె స్పందించారు. 

ఏపీ విషయానికొస్తే... మరోసారి ప్రత్యేక హోదా ఊసు లేకుండా, విభజన చట్టంలోని అనేక అంశాలను బూజు పట్టించారని అన్నారు. అటు రాష్ట్ర ప్రజల ఆశలను, ఇటు కూటమి పొత్తు ధర్మాన్ని రెండింటినీ నిలువునా దగా చేశారని షర్మిల మండిపడ్డారు. ఈ బడ్జెట్ లో ఏపీకి ఇచ్చిన హామీలే ఈ మోసానికి నిదర్శనమని విమర్శించారు. దశాబ్ద కాలంగా కష్టాలు ఎదుర్కొంటున్న ఏపీని ఎన్డీయే ప్రభుత్వం మరోసారి నిరాశకు గురిచేసిందని అన్నారు. 

దేశ భవితకు సంబంధించిన బడ్జెట్ ను టైమ్ పాస్ డాక్యుమెంటుగా, సందు చివర కిరాణా కొట్టు పద్దుల స్థాయికి దిగజార్చిన ఘనత బీజేపీదేనని ఘాటు విమర్శలు చేశారు. దీనిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. పెద్ద పెద్ద మాటలు చెప్పిన టీడీపీ, జనసేన పార్టీలు ప్రజలకు క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News