Revanth Reddy: ఏపీకి ఎందుకిచ్చారని అడగం... తెలంగాణకు ఎందుకివ్వలేదో చెప్పాలి: మోదీపై రేవంత్ రెడ్డి నిప్పులు

CM Revanth Reddy fires at PM Modi over Budget

  • మోదీని పెద్దన్న పాత్ర పోషించాలని అడిగితే తెలంగాణకు అన్యాయం చేశారని ఆగ్రహం
  • ఎన్డీయే సర్కార్‌ది కుర్చీ బచావో బడ్జెట్ అని ఎద్దేవా
  • బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి కిషన్ రెడ్డిదే బాధ్యత అని విమర్శ
  • దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతానన్న సీఎం
  • కేసీఆర్ రేపు సభకు వచ్చి బడ్జెట్‌పై నిలదీయాలన్న ముఖ్యమంత్రి

బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు జరిపి... తెలంగాణపై వివక్ష చూపించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏపీకి ఎందుకు ఇచ్చారని మేం అడగం... తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు? అని మాత్రమే అడుగుతున్నామన్నారు. ప్రధాని మోదీ పెద్దన్న పాత్ర పోషించాలని తాము పదేపదే అడిగామని... కానీ తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. కేంద్రమంత్రులను కలిసి కూడా విజ్ఞప్తి చేశామన్నారు. బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారన్నారు. పోలవరానికి నిధులు ఇచ్చినట్లే పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వరో చెప్పాలన్నారు.

ఎన్డీయే సర్కార్‌ది కుర్చీ బచావో బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. ఏపీ, బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేశారన్నారు. కానీ తెలంగాణకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇది మోదీకి గౌరవాన్ని తెచ్చిపెట్టదన్నారు. బీజేపీకి తెలంగాణ ప్రజల వల్ల 8 లోక్ సభ సీట్లు, 35 శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల నిర్ణయం వల్లే మోదీ ప్రధాని కుర్చీలో కూర్చున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ కృతజ్ఞత చూపాల్సిన సమయం ఇదే అన్నారు.

తెలంగాణకు బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిదే బాధ్యత అని ఆరోపించారు. కిషన్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కనీసం సవరించే బడ్జెట్‌లో అయినా తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమను బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచించి కేటాయింపులు జరపాలన్నారు. తాము కేంద్రంతో సఖ్యతగా ఉండాలనుకున్నామని, కానీ కేంద్రం అలా ఆలోచన చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ పౌరుల గురించి కేంద్రం ఆలోచించాల్సిందన్నారు.

ఐఐఎం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని నిలదీశారు. ఎవరి దయాదాక్షిణ్యాల మీదా తెలంగాణ ఆధారపడదన్నారు. పునర్విభజన చట్టం కేవలం ఏపీకేనా? తెలంగాణకు వర్తించదా? అని నిలదీశారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగిందన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతానన్నారు. కేరళ సీఎంతోనూ మాట్లాడుతానని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షపై కొట్లాడుతామన్నారు. తమతో కలిసి వచ్చే వారితో ముందుకు సాగుతామన్నారు.

బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని కేసీఆర్ నిలదీయాలని సూచించారు. రేపు సభకు వచ్చి కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. రేపు సభకు రాకుంటే కిషన్ రెడ్డితో కేసీఆర్‌కు చీకటి ఒప్పందం ఉన్నట్లే అన్నారు. తెలంగాణ పదం పలకడానికే కేంద్రానికి ఇష్టం లేదని విమర్శించారు. కేంద్రం మొదటి నుంచి తెలంగాణపై వివక్ష చూపిస్తోందన్నారు. తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.

తాను ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లానని... మూడుసార్లు ప్రధాని మోదీని నేరుగా కలిశానన్నారు. వివక్ష లేకుండా తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరానని తెలిపారు. కానీ బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని కూడా ప్రస్తావించలేదన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుందనుకున్నాం... కానీ కక్షపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. అయినా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే మోదీ తప్పుపట్టారని మండిపడ్డారు.

మూసీ రివర్ ప్రాజెక్టు కోసం నిధులు అడిగితే రూపాయి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రోకు నిధులు లేవు... ఐటీఐఆర్ కారిడార్ ప్రస్తావన లేదు... కేవలం క్విడ్ ప్రోకో అన్నట్లుగా బడ్జెట్ ఉందన్నారు. ఏపీకి, బీహార్‌‍కు తాయిలాలు ఇచ్చి కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది మోదీకి సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యత వహించాలన్నారు.

  • Loading...

More Telugu News