KTR: ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్... ఇప్పుడేమో ఫండ్స్ డైవర్షన్: కేటీఆర్

KTR counter to Revanth Reddy

  • ఏడు నెలలు ఏమార్చి చేసిన రుణమాఫీ చారాణ కోడికి బారాణ మసాలా వలె ఉందన్న కేటీఆర్
  • రుణమాఫీ అయిన రైతుల కంటే కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్య
  • మెజార్టీ రైతుల్లో నిరాశ మిగిల్చినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? అని ప్రశ్న

రుణమాఫీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఫండ్స్ డైవర్షన్ చేస్తోందని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.

'సీఎం గారు... ఊరించి.. ఊరించి.. ఏడునెలలు ఏమార్చి చేసిన.. మీ రుణమాఫీ తీరు చూస్తే.. తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన  సామెత ఒక్కటే.. చారాణ కోడికి..! బారాణ మసాలా...!!' అన్నట్లుగా ఉందన్నారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు.. రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలు అయ్యాయన్నారు.

అన్నివిధాలా అర్హత ఉన్నా.. ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడన్నారు. రైతులు గోడు చెప్పుకుందామంటే వినేటోడు కూడా లేడన్నారు. అర్హులైన లబ్దిదారులు.. రుణమాఫీ కాక.. అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలు? అని ప్రశ్నించారు. నలభై లక్షల మందిలో.. మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా? ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా? ఈ సంబరాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు సీజన్లు అయినా.. రైతు భరోసా ఇంకా షురూ చెయ్యలేదని... జూన్‌లో వేయాల్సిన రైతు భరోసా.. జూలై వచ్చినా రైతుల ఖాతాలో వేయలేదన్నారు. కౌలు రైతులకు.. ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యలేదని మండిపడ్డారు. రైతు కూలీలకు.. 
రూ.12 వేల హామీ ఇంకా అమలు చేయలేదన్నారు. మభ్యపెట్టే మీ పాలన గురించి.. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇదివరకు అటెన్షన్ డైవర్షన్, ఇప్పుడేమో ఫండ్స్ డైవర్షన్ అన్నారు.

  • Loading...

More Telugu News