KTR: ఎమ్మెల్యే సబిత హక్కులను కాలరాశారు: స్పీకర్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

KTR open letter to Speaker

  • మహేశ్వరంలో బోనాల చెక్కుల పంపిణీని కాంగ్రెస్ నేతతో పంపిణీ చేయించారని ఆరోపణ
  • ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పటికీ వారు పంపిణీ చేయడమేమిటని సబిత ప్రశ్న
  • ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ నేతలకు పథకాల పంపిణీ బాధ్యతలను అప్పగిస్తున్నారని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యేల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందన్నారు.

ఏం జరిగింది?

మహేశ్వరం నియోజకవర్గం, ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ సందర్భంగా రసాభాస జరిగింది. ఇక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘించి కాంగ్రెస్ నాయకులతో చెక్కులు పంపిణి చేయించారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకుడు చెక్కులను పంపిణీ చేయడంపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె నిరసన తెలిపారు.

ప్రభుత్వం నుండి చేపట్టే ఏ కార్యక్రమమైనా పార్టీ పరంగా చేస్తామని, ఓడిపోయిన వ్యక్తుల చేతనే కార్యక్రమాలను నిర్వహింపచేస్తామని ఒక చట్టం తీసుకువస్తే తమకేమీ ఇబ్బంది లేదని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. గెలిచిన వ్యక్తులు అంటే గౌరవం లేకుండా రాజకీయ ఏజెండాగానే పాలన నడిపిస్తున్నారని ముఖ్యమంత్రిపై ఆరోపించారు. రాష్ట్రంలో అత్యాచారాలు, దోపిడీలు చేస్తుంటే ఈ ప్రభుత్వం కళ్లు మూసుకొని పాలన కొనసాగిస్తోందన్నారు. నిరుద్యోగులంతా రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి కనపడటం లేదా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులను గౌరవించే సంస్కృతిని ఈ ప్రభుత్వం మరిచిపోతోందని, స్పీకర్ ఈ వ్యవస్థను గాడిలో పెట్టాలని కోరారు.

ప్రజాపాలనలో సీనియర్ మహిళా నాయకురాలికి దక్కే గౌరవం ఇదేనా?

ప్రజాపాలనలో సీనియర్ మహిళా నాయకురాలికి దక్కే గౌరవం ఇదేనా? అని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. మహేశ్వరం నియోజకవర్గంలో మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఆరోపించింది.

  • Loading...

More Telugu News