Platform Fee Hike: కస్టమర్లకు ఉమ్మడిగా షాకిచ్చిన జొమాటో, స్విగ్గీ!

swiggy zomato hike platform fee

  • ఆదాయం పెంపు లక్ష్యంగా ఫుడ్ డెలివరీ యాప్‌లు కస్టమర్లకు వడ్డింపులు
  • ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఫ్లాట్‌ఫామ్ ఫీజు రూ.6కు పెంపు 
  • ఫీజును రూ.7కు పెంచి రాయితీ ఇచ్చి రూ.6గా చేసిన స్విగ్గీ

ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలు కస్టమర్లకు తాజాగా షాకిచ్చాయి. ఢిల్లీ, బెంగళూరు వంటి డిమాండ్ ఉన్న నగరాల్లో ప్లాట్‌ఫామ్ ఫీజును ఇకపై రూ.6 చేసినట్టు పేర్కొన్నాయి. గతంలో ఈ ఫీజు రూ.5గా ఉండేది. దీంతో, ఫ్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం మేర పెంచినట్టైంది. అయితే, బెంగళూరులో ఫీజును స్విగ్గీ తొలుత రూ.7గా పేర్కొని ఆ తరువాత రాయితీ ఇచ్చి రూ.6గా చేసింది. 

గతంలో కూడా జొమాటో స్విగ్గీలు తమ ప్లాట్‌ఫాం ఫీజును పెంచాయి. 2023లో ఈ తరహా ఫీజును ప్రారంభించాయి. మొదట రూ.2గా ఉన్న ఫీజును విడతల వారీగా పెంచుతూ వెళ్లాయి. ఏప్రిల్‌లో జొమాటో ఈ ఫీజును 25 శాతం మేర పెంచి రూ.5గా చేసింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, లఖ్‌నవూ నగరాలను పెంపును వర్తింపజేసింది. ఇక వేగవంతమైన డెలివరీల కోసం ప్రియారిటీ ఫీజు పేరిట ప్రత్యేక రుసుమును కూడా వసూలు చేస్తోంది. 

ఒక్కో ఆర్డరపై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా డెలివరీ యాప్‌లు ఈ తరహా ఫీజులకు తెరలేపాయి. బెంగళూరులో బ్లింకిట్ ఒక్కో ఆర్డర్‌పై రూ.4, ఇన్‌స్టా మార్ట్‌ రూ.5 వసూలు చేస్తోంది.ఢిల్లీలో ఈ చార్జీలు వరుసగా రూ.16, రూ.4గా ఉన్నాయి.  మరోవైపు, కొన్ని సమయాల్లో ఈ రెండు ప్లాట్‌ఫామ్‌ల సర్జ్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నాయి. టాటా గ్రూపునకు చెందిన బీబీనౌ రూ. 99పైన విలువ చేసే ఆర్డర్లపై రూ.5 హ్యాండ్లింగ్ చార్జీలు వసూలు చేస్తోంది.

  • Loading...

More Telugu News