Special Status: ప్రత్యేక హోదా డిమాండ్ల వేళ కేంద్ర మంత్రి జితన్‌రామ్ కీలక వ్యాఖ్యలు

Jitan Ram Manjhi said that NITI Aayog denies special status to any state

  • ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని నీతి ఆయోగ్ చెప్పిందని వెల్లడి
  • రాష్ట్ర ఆర్థిక అవసరాలను తీరుస్తామని పునరుద్ఘాటన
  • జేడీయూ నేతల డిమాండ్ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు

బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జేడీయూ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి జితన్‌రామ్ మాంఝీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని నీతి ఆయోగ్ చెప్పిందని పునరుద్ఘాటించారు. ఈ మేరకు నిబంధనలు ఏవీ లేవని, అయితే రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీరుతాయని ఆయన అన్నారు.

‘‘దేశంలోని ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదాను ఇవ్వొద్దని నీతి ఆయోగ్ స్పష్టంగా చెప్పింది. రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు ఏదైనా చేయగలరు. కానీ ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోం. బీహార్‌కు ఆర్థిక సహకారం అందించేందుకు కేంద్రం హామీ ఇచ్చింది. అభివృద్ధికి ఎంత డబ్బు కావాలన్నా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ అందజేస్తారు’’ అని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన హాజీపూర్‌లో మీడియాతో మాట్లాడారు.

కాగా కేంద్రంలో మూడోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడడంలో జేడీయూ మద్దతు కీలకంగా ఉంది. దీంతో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ నాయకులు కోరుతున్నారు. జేడీయూ కీలక నేతలు విజయ్ కుమార్ చౌదరి, అశోక్ చౌదరి తమ డిమాండ్లపై గళం విప్పారు. మరోవైపు బీహార్‌లో ప్రత్యేక హోదా రాజకీయ అంశంగా మారింది. ఎన్‌డీఏ ప్రభుత్వంలో జేడీయూ భాగమైనప్పటికీ నుంచి ప్రత్యేక హోదా తీసుకోవాలంటూ విపక్ష ఆర్‌జేడీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు తేజస్వి యాదవ్, కాంగ్రెస్ నేత మీరా కుమార్ వంటి ప్రతిపక్ష నాయకులు జేడీయూపై విమర్శల దాడి చేస్తున్నారు.

  • Loading...

More Telugu News