Manchu Vishnu: నటులు, కుటుంబ సభ్యులపై ట్రోలింగ్ వీడియోలు... ఆ యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించిన 'మా'

Five Youtube Channels canceled for trolling

  • ఇది ఆరంభమే.. భవిష్యత్తులో ఇలాంటి ఛానల్స్‌పై చర్యలు కొనసాగుతాయన్న 'మా'
  • ఐదు ఛానల్స్‌ను రద్దు చేయించిన 'మా'
  • ట్రోలింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు మంచు విష్ణు విజ్ఞప్తి

టాలీవుడ్ నటీనటులు, వారి కుటుంబాలు లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలు, అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న ఐదు యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించినట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఇది ఆరంభం మాత్రమేనని... భవిష్యత్తులో ఇలాంటి ఛానల్స్‌పై చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. జస్ట్ వాచ్ బీబీసీ, ట్రోల్స్ రాజా, బచినా లలిత్, హైదరాబాద్ కుర్రాడు, ఎక్స్‌వైజెడ్ఎడిట్ 007 యూట్యూబ్ ఛానళ్ళు రద్దు చేసిన జాబితాలో ఉన్నాయి. 

హీరోహీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48 గంటల్లో తొలగించాలని డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్‌కు మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల విజ్ఞప్తి చేశారు. ట్రోలింగ్ చేస్తూ పోస్ట్ చేసిన వీడియోలను తొలగించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల ఓ తండ్రీ, కూతురుపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో పోస్ట్ చేసిన యూట్యూబర్లపై విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకునేది లేదన్నారు. ఈ మేరకు ఆయన వీడియోను విడుదల చేశారు.

ట్రోలింగ్ వీడియోలు, అసభ్యకర వీడియోలు పోస్ట్ చేసిన వారికి 48 గంటలు మాత్రమే సమయం ఇస్తున్నామని, దయచేసి ఇలాంటి వీడియోలను తక్షణమే తొలగించాలని విజ్ఞప్తి చేశారు. వాటిని తొలగించకుంటే సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. సదరు యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరఫున అప్పీల్ చేశారు. నటీనటులపై ట్రోలింగ్ వీడియోలు చేసినా... డార్క్ కామెడీ పేరుతో వీడియోలు చేసినా... అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

  • Loading...

More Telugu News