KTR: పెన్షన్ కింద ఇచ్చిన రూ. 1.72 లక్షలు వెనక్కి ఇవ్వాలని వృద్ధురాలికి నోటీసులు.. మండిపడ్డ కేటీఆర్

KTR fires on revanth govt for sending pension recovery notice to pensioner

  • ప్రభుత్వ తీరు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుందని ఎద్దేవా
  • రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి ఈ ఉదంతం నిదర్శనమని ధ్వజం
  • ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలని హితవు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలికి పెన్షన్ కింద ఇచ్చిన రూ. 1.72 లక్షలను వెనక్కి ఇవ్వాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) మండిపడ్డారు. ప్రభుత్వ తీరు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. మల్లమ్మకు ప్రభుత్వం పంపిన నోటీసును ఆమె ఫొటోతోపాటు జత చేశారు. అనర్హులైనప్పటికీ రూ. 1,72,928 ను పొందినందుకు ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం పేరిట ఆమెకు రికవరీ నోటీసు పంపినట్లు అందులో రాసి ఉంది.

‘కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టింది. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్దిదారుల నుంచి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోంది.  ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతున్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనం’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.

పేదలపై ఇటువంటి దుర్మార్గపు చర్యలను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారని హెచ్చరించారు.

2017 నుంచి మల్లమ్మ డిపెండంట్ పెన్షన్ పొందుతున్నారు. వైద్య శాఖలో పనిచేసిన మల్లమ్మ కుమార్తె 2017లో మరణించడంతో నాటి నుంచి పెన్షన్ అందుకుంటున్నారు. అయితే ఆమె కుమార్తె ప్రభుత్వ ఉద్యోగం చేసినందున పెన్షన్ పొందే అర్హత మల్లమ్మకు లేదని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News