Latham Airlines: రన్ వేను ఒరుసుకుంటూ టేకాఫ్ అయిన బోయింగ్ విమానం

Near Catastrophe Boeing 777 Scrapes Tail On Takeoff Avoids Major Incident

  • వ్యాపించిన దట్టమైన పొగలు, ఎగసిపడ్డ నిప్పురవ్వలు
  • అయినప్పటికీ గాల్లోకి ఎగిరిన విమానం.. గంటా పది నిమిషాల తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • ఎయిర్ పోర్టులోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ప్రమాద దృశ్యాలు
  • ఇటలీలోని మిలాన్ మాల్ పెన్సా ఎయిర్ పోర్టులో ఘటన

దక్షిణ అమెరికాకు చెందిన లాతమ్ ఎయిర్ లైన్స్ విమానానికి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఇటలీలోని మిలాన్ మాల్ పెన్సా ఎయిర్ పోర్టు నుంచి బోయింగ్ 777–300ఈఆర్ రకానికి చెందిన విమానం టేకాఫ్ అయ్యే క్రమంలో దాని తోక భాగం రన్ వేను తాకింది. అలా కొన్ని వందల మీటర్ల దూరంపాటు రన్ వేను ఒరుసుకుంటూనే విమానం ముందుకు దూసుకెళ్లింది. ఈ సమయంలో దట్టమైన పొగలు వచ్చాయి. నిప్పురవ్వలు కూడా వచ్చినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ నెల 9 జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఎయిర్ పోర్టులోని నిఘా కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయినప్పటికీ విమానం సురక్షితంగానే గాల్లోకి ఎగిరింది. 

అనంతరం విమాన పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ను సంప్రదించారు. ఎయిర్ పోర్టులో తిరిగి అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి కోరారు. అయితే విమానం నిండా ఇంధనం ఉండటంతో సుమారు గంటా పది నిమిషాలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం ఎట్టకేలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత అందులోని ప్రయాణికులు, సిబ్బంది వెంటనే కిందకు దిగారు. ఇప్పటికీ ఆ విమానం ఇంకా మాల్ పెన్సాలోనే ఉంది. వాస్తవానికి ఈ విమానం బ్రెజిల్ లోని సావోపాలోకు చేరుకోవాల్సి ఉంది.

ఈ ఘటనపై నేషనల్ ఏజెన్సీ ఫర్ ఫ్లైట్ సేఫ్టీ (ఏఎన్ ఎస్ వీ) దర్యాప్తు ప్రారంభించింది. దీనిపై నిపుణులు స్పందిస్తూ ఆ సమయంలో పైలట్లు ఒకవేళ టేకాఫ్ ను రద్దు చేసుకొని ఉండి ఉంటే భయంకరమైన పరిణామాలు చొటుచేసుకొని ఉండేవని అభిప్రాయపడ్డారు. వాళ్లు విమానాన్ని సరిగ్గా నడిపి ఉండేవాళ్లు కాదని ఓ స్థానిక వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు.

  • Loading...

More Telugu News