Hurricane Beryl: టెక్సాస్‌లో బెరిల్ హరికేన్ బీభ‌త్సం.. ముగ్గురి మృతి!

Hurricane Beryl unleashes devastation in Texas

  • బెరిల్ కార‌ణంగా టెక్సాస్ వ్యాప్తంగా బలమైన గాలులు, కుండపోత వర్షం
  • విద్యుత్ ప్ర‌సారానికి అంత‌రాయం.. అంధ‌కారంలోకి 2.7 మిలియన్లకు పైగా ప్రజలు 
  • 1,300కు పైగా విమాన స‌ర్వీసుల క్యాన్సిల్‌

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో బెరిల్ తుపాను విధ్వంసం సృష్టిస్తోంది. బెరిల్ కార‌ణంగా వీస్తున్న‌ బలమైన గాలులు, కుండపోత వర్షం కార‌ణంగా సోమవారం టెక్సాస్‌లో ముగ్గురు మృత్యువాత ప‌డ్డారు. విద్యుత్ ప్ర‌సారానికి అంత‌రాయం ఏర్ప‌డ‌టంతో 2.7 మిలియన్లకు పైగా ప్రజలు అంధ‌కారంలోకి వెళ్లిపోయారు. వ‌ర‌ద నీటి తాకిడి వ‌ల్ల‌ ర‌హ‌దారులు దెబ్బ‌తిని రాక‌పోక‌లు నిలిచిపోయాయి. వేలాదిగా వ్యాపారాలు మూత‌ప‌డ్డాయి. అలాగే 1,300కు పైగా విమాన స‌ర్వీసుల‌ను అధికారులు రద్దు చేశారు. 

ఇక గత వారం బెరిల్ హరికేన్.. జమైకా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ లో బీభ‌త్సం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇది టెక్సాస్‌కు చేరుకునేలోపే మెక్సికో, కరేబియన్‌లలో కనీసం 11 మందిని పొట్ట‌న‌పెట్టుకుంద‌ని టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ పాట్రిక్ తెలిపారు. హ్యూస్టన్ మీదుగా వెళ్ల‌డానికి ముందు ఈ ప్రమాదకరమైన తుపాను తీరప్రాంతమైన‌ టెక్సాస్ పట్టణం మాటగోర్డాను తాకింద‌న్నారు. 

తుపాను కార‌ణంగా హ్యూస్టన్ ప్రాంతంలో ఇళ్లపై చెట్లు కూలిన ఘటనలో 53 ఏళ్ల వ్యక్తి, 74 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందారు. అలాగే హ్యూస్టన్ నగరానికి చెందిన ఓ ఉద్యోగి పనికి వెళ్తున్న స‌మ‌యంలో అండర్‌పాస్‌లో మునిగిపోయి చ‌నిపోయిన‌ట్లు పాట్రిక్ చెప్పారు. 

ఇక విద్యుత్ ప్ర‌సారాన్ని పునరుద్ధరించడానికి చాలా రోజులు పడుతుందని టెక్సాస్ పబ్లిక్ యుటిలిటీ కమిషన్ చైర్ థామస్ గ్లీసన్ వెల్ల‌డించారు. టెక్సాస్ డివిజన్ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ చీఫ్ నిమ్ కిడ్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 2,500 మంది ఫస్ట్ రెస్పాండర్‌లను తుపాను ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం బ‌రిలోకి దింపిన‌ట్లు తెలిపారు.

సోమ‌వారం తెల్లవారకముందే గాల్వెస్టన్, సార్జెంట్, లేక్ జాక్సన్, ఫ్రీపోర్ట్ వంటి నగరాల్లో బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షం కురిసిన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. తెల్లవారుజామున హ్యూస్టన్‌లో చాలా చెట్లు నేలకూలాయి. ఇక భారీగా పోటెత్తిన‌ వ‌ర‌ద‌ల వ‌ల్ల ర‌హ‌దారులు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. హ్యూస్టన్‌లోని చాలా ప్రాంతాలలో వరద నీరు 10 అంగుళాలు (25 సెం.మీ.) మించి ప్ర‌వాహిస్తోందని మేయర్ జాన్ విట్‌మైర్ చెప్పారు. ప్ర‌జలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మేయ‌ర్ సూచించారు.

  • Loading...

More Telugu News