Napoleon: వేలంలో భారీ ధర పలికిన నెపోలియన్ ఆత్మహత్య చేసుకోవాలని భావించిన పిస్తోళ్లు

Pistols With Which Napoleon Intended To Kill Himself Sold For huge price In France

  • సుమారు రూ.15 కోట్లు పలికిన రెండు పిస్తోళ్లు
  • పారిస్ లో వేలం నిర్వహణ
  • ఈ పిస్తోళ్లకు ఆసక్తికర చరిత్ర

ఫ్రాన్స్ చరిత్రపై బలమైన ముద్రవేసిన సైన్యాధ్యక్షుడు, రాజకీయ నాయకుడు ‘నెపోలియన్ బోనపార్టే’.. ఒకప్పుడు తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించాలని భావించిన రెండు పిస్తోళ్లను వేలం వేయగా భారీ ధర పలికాయి. ఫ్రాన్స్‌లో నిర్వహించిన వేలంలో ఈ రెండు పిస్తోళ్లను ఏకంగా 1.69 మిలియన్ యూరోలకు ($1.8 మిలియన్) విక్రయించినట్లు వేలం నిర్వహణ సంస్థ ‘ఒసేనాట్ ఆక్షన్’ తెలిపింది. అయితే కొనుగోలు చేసినవారి పేర్లను మాత్రం గోప్యంగా ఉంచింది. పారిస్‌లోని ఫాంటైన్‌బ్లూలో వేలాన్ని ఆదివారం నిర్వహించారు.

కాగా ఈ పిస్తోళ్లను వేలం వేయడానికి ముందు రోజు వీటిని దేశ సంపదగా ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ కమిషన్ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ వస్తువులను జాతీయ సంపదగా వర్గీకరించామని, వాటి విక్రయంపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో వేలం పాటలో దక్కించుకున్న వ్యక్తుల నుంచి ఈ పిస్తోళ్లను ఫ్రాన్స్ ప్రభుత్వం తిరిగి దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

30 నెలల వ్యవధిలో పిస్తోళ్లను తిరిగి కొనుగోలు చేయవచ్చు. సదరు వ్యక్తి నుంచి దక్కించుకునేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కొనుగోలు ఆఫర్‌‌ను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఈ ఆఫర్‌ను తిరస్కరించే హక్కు వేలంలో దక్కించుకున్న వ్యక్తికి ఉంటుంది. కాగా దేశ సంపదగా ప్రకటించిన ఏ వస్తువునైనా తాత్కాలికంగా మాత్రమే ఫ్రాన్స్ వెలుపలకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఆ దేశ నిబంధనలు చెబుతున్నాయి. ఆ తర్వాత తప్పనిసరిగా తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని ‘ఒసేనాట్ ఆక్షన్’ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

కాగా ఈ రెండు పిస్తోళ్లను బంగారం, వెండితో తయారు చేశారు. ఈ రెండు తుపాకులు సామ్రాజ్య వైభవంతో కనిపిస్తున్నాయి. కాగా 1814లో విదేశీ సైన్యం పారిస్‌ను ఆక్రమించుకోవడంతో నెపోలియన్ అధికారాన్ని వదులుకోవాల్సి వచ్చింది. తీవ్ర నిరాశ, ఒత్తిడికి లోనైన ఆయన ఈ తుపాకీలతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. అయితే ఆయన వద్ద పనిచేసే అధికారి ఒకరు తుపాకీలోని పౌడర్‌ను తొలగించారని వేలం సంస్థ నిపుణుడు జీన్-పియర్ ఒసేనాట్ వెల్లడించారు. తుపాకీ పనిచేయకపోవడంతో నెపోలియన్ విషం తాగారని, అయితే వాంతి కావడంతో ప్రాణాలతో బయటపడ్డారని, తన పట్ల విధేయత చూపిన ఆ అధికారికి ఈ పిస్తోళ్లను బహుమతిగా అందించారని వివరించారు.

  • Loading...

More Telugu News