Team India: ప్రపంచకప్తో స్వదేశం చేరుకున్న రోహిత్ సేన.. ఎయిర్పోర్టులో ఘన స్వాగతం
![Team IndiaT20 World Cup 2024 champion returns home Indian lands in Delhi after 16 hour flight](https://imgb.ap7am.com/thumbnail/cr-20240704tn668603db017e8.jpg)
- నేటి ఉదయం 6.05 గంటలకు న్యూఢిల్లీ ఎయిర్పోర్టులో దిగిన విమానం
- కప్ చేతపట్టుకుని ఎయిర్పోర్టు బయటకొచ్చిన రోహిత్ శర్మ, టీం సభ్యులు
- వేల మంది అభిమానుల మధ్య రోహిత్ సేనకు ఘన స్వాగతం
- కప్ చేతబూనిన క్రికెటర్లను చూసి అభిమానుల్లో హర్షాతిరేకాలు
టీ20 ప్రపంచకప్ గెలిచి యావత్ భారత దేశాన్ని గర్వంతో ఉప్పొంగేలా చేసిన టీమిండియా సుదీర్ఘకాలం తరువాత స్వదేశానికి చేరుకుంది. బార్బడాస్ నుంచి టీమిండియా సభ్యులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఈ ఉదయం సుమారు 6 గంటలకు ప్రపంచకప్ విజేతలతో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. అనంతరం, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచకప్ చేతపట్టుకుని ముందు నడవగా టీమిండియా సభ్యులు ఎయిర్పోర్టు బయటకు వచ్చారు. ఆ దృశ్యం చూసిన క్రికెట్ అభిమానుల్లో హర్షాతిరేకాలు పెల్లుబికాయి. గత శనివారం ప్రపంచకప్ గెలిచినప్పటికీ బెరిల్ తుపాను కారణంగా టీమిండియా ప్రయాణం కొన్ని రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే.
మరోవైపు, టీమిండియాకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు విమానాశ్రయానికి పోటెత్తారు. వేల మంది అభిమానులు, మీడియా ప్రతినిధులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. టీం సభ్యులకు ఐటీసీ మౌర్యలో బస ఏర్పాటు చేశారు. దీంతో, టీమిండియా బస్సులో హోటల్కు బయలుదేరింది. నేడు రోహిత్ శర్మ బృందం తొలుత ప్రధానిని కలిసి ఆయనతో అల్పాహార విందులో పాల్గొంటారు. అనంతరం, ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్లో ముంబైకి బయలుదేరుతారు. నేడు సాయంత్రం అక్కడి వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో బీసీసీఐ సెక్రటరీ జై షా టీమిండియా సభ్యులకు రూ. 125 కోట్ల నగదు బహుమతిని పంపిణీ చేస్తారు.