Chandrababu: రాజధాని విధ్వంసంతో భవిష్యత్తును నాశనం చేశాడు: జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు

handrababu fires at YS Jagan while releasing white paper

  • అమరావతి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కష్టమంతా వృథా అయిందనే బాధ ఉందన్న ఏపీ సీఎం
  • ఇన్వెస్టర్లకు ఆ భూతం, ఆ దుర్మార్గుడు ఇంకా ఉంటాడనే భయం ఉందని వ్యాఖ్య
  • ప్రజావేదిక నుంచి విధ్వంసం ప్రారంభించాడని ఆగ్రహం
  • 2004లో నేను కంటిన్యూ అయి ఉంటే హైదరాబాద్ వేరే లెవల్లో ఉండేదన్న చంద్రబాబు

2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఎంతో అభివృద్ధి చెందాల్సిన రాజధాని అమరావతిలో విధ్వంసం సృష్టించారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. రాజధాని అమరావతిపై ఆయన బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అమరావతి కోసం తాము పడిన కష్టం అంతా వృథా అయిందన్నారు. అయిదేళ్ల తర్వాత అమరావతిని చూసినప్పుడు తనకు ఎంతో బాధ కలుగుతోందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇంత కష్టపడితే రాజధాని పట్ల దుర్మార్గంగా వ్యవహరించారనే బాధ తనకు కలుగుతోందన్నారు. ఇది తనకు చేసిన ద్రోహం కాదని... జాతి ద్రోహమే అన్నారు. ఇక, రాజధానిని అభివృద్ధి చేసి... మాది అమరావతి అని చెప్పుకునే పరిస్థితి రావాలన్నారు.

ఇన్వెస్టర్లకు ఆ భూతం, దుర్మార్గుడు ఉంటాడనే భయం ఉంది

హైదరాబాద్‌ను పదేళ్లు కామన్ క్యాపిటల్‌గా చేశారని... ఇప్పుడు అది తెలంగాణకు మాత్రమే రాజధాని అన్నారు. ఈలోగా అమరావతిని అభివృద్ధి చేసుకుని వుండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీరువల్ల పెట్టుబడిదారులకు నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరలా సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు. అలాగే, పెట్టుబడులు పెట్టేవారికి ఇప్పుడు భయం ఉందన్నారు. ఆ భూతం, దుర్మార్గుడు (జగన్‌ను ఉద్దేశించి) ఇక్కడే ఉంటాడు కదా... మేం రిస్క్ ఎందుకు చేయాలని వారు అనుకుంటారు కదా అన్నారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పోయిందన్నారు. ఇప్పుడు ఎవరిని అడిగినా చేస్తాం.. చూస్తామని చెబుతున్నారని... ఇప్పుడు మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు.

ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చి భావితరాల భవిష్యత్తును నాశనం చేశారు

ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చి... భావితరాల భవిష్యత్తును నాశనం చేశారని జగన్‌ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రజలు ఏం చేశారని రాజధానిలో విధ్వంసం సృష్టించారని ప్రశ్నించారు. మనం ఎన్ని చేసినా ఆ దుష్టశక్తి నుంచి అమరావతిని ఈ అయిదేళ్లు కాపాడుకోలేకపోయామన్నారు. కానీ ఇప్పుడు మనం అభివృద్ధి చేసుకునే సమయం వచ్చిందని చెప్పారు. మన యువతకు... ఇక్కడ అవకాశాలు లేక బయటకు పోతే పర్లేదు.. కానీ అవకాశాలు ఉండి బయటకు ఎందుకు వెళ్లాలన్నారు. అసలు రాజధానిని ధ్వంసం చేసిన వ్యక్తికి ఇక్కడ ఉండే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. అసలు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడా? అని మండిపడ్డారు. రాజధాని పరిస్థితి ఐదేళ్ల క్రితం ఎక్కడ ఉందో ఇప్పుడూ అక్కడే ఉందన్నారు. ఇంకా చెప్పాలంటే డ్యామేజ్ చేశారని ఆరోపించారు.

ప్రజావేదిక నుంచి విధ్వంసం ప్రారంభం

2019లో అధికారంలోకి వచ్చాక ప్రజావేదిక కూల్చివేత నుంచి విధ్వంసం ప్రారంభమైందని మండిపడ్డారు. ఆ తర్వాత మూడు రాజధానుల ప్రకటన, జీఎన్ రావు కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ... ఇలా ఎన్ని విన్యాసాలు చేయాలో అన్ని విన్యాసాల ద్వారా విధ్వంసం చేశారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో ఎన్నో వెసులుబాట్లు నిలిపివేశారన్నారు.

సింగపూర్ కన్సార్టియం వన్ అఫ్ ది బెస్ట్ అని... కానీ దానిపై ఆరోపణలు చేసి తప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాజధానిని మారుస్తామని చెప్పిన వారు చరిత్రలో లేరన్నారు. కానీ ఇలాంటి తిక్కవారి వద్ద కూడా రాష్ట్రాన్ని, రాజధానిని కాపాడుకోవడానికి ఏం చేయాలో అది చేస్తామన్నారు. అసలు ఏపీ, రాజధాని ఓ కేస్ స్టడీ అన్నారు.

హ్యాపీ నెస్ట్ రూ.720 కోట్ల ప్రాజెక్ట్ అని... దీని ద్వారా ఆరోజు రూ.57 కోట్లు లాభం వచ్చి ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ పెరగడంతో పాటు రూ.165 కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి కానీ భవనాల నిర్మాణాల ఖర్చు పెరిగిందన్నారు. నాలెడ్జ్ ఎకానమీలోనే లక్షలాది ఉద్యోగాలు వచ్చాయని... అమరావతి అభివృద్ధి అయి ఉంటే ఎంతోమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కేవన్నారు.

తాను ముందుచూపుతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానన్నారు. ఈ నగరం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. కానీ ఏపీలో ఈ అయిదేళ్ల పాలన కారణంగా వెల్త్ క్రియేషన్ తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 2019లో జడ్జిల క్వార్టర్లు, ఐఏఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీల క్వార్టర్లు ఎలా ఉన్నాయో... ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపించారు.

29 వేల మంది రైతులు రాజధాని కోసం 34 వేలకు పైగా ఎకరాల భూమిని ఇచ్చారన్నారు. రైతులు ఇచ్చిన భూమికి తాము ప్రతి సంవత్సరం పరిహారం ఇచ్చామన్నారు. దేశంలో ఏ నగరానికి లేని సౌకర్యాలు అమరావతికి ఉన్నాయన్నారు. మనకు కృష్ణా, గోదావరి రివర్ ఫ్రంట్ ఉందని... ఇన్ని వేల కిలో మీటర్ల రివర్ ఫ్రంట్ ఎక్కడా లేదన్నారు. రెండు నదుల అనుసంధానంతో ఎప్పుడూ ఫ్రెష్ వాటర్ అందుబాటులో ఉంటుందన్నారు.

తాను 2004లో కంటిన్యూ అయి ఉంటే...

తాను హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానన్నారు. 2004లో తానే కంటిన్యూ అయి ఉంటే హైదరాబాద్ వేరే లెవల్‌లో ఉండేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అభివృద్ధికి పదేళ్లు పట్టిందన్నారు. అమరావతికీ అదే వర్తిస్తుందన్నారు. తాను కంటిన్యూ అయి ఉంటే వేరేలా ఉండేదన్నారు. అయినప్పటికీ తాను పాజిటివ్‌గా ఆలోచిస్తానని... ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభిస్తానన్నారు. వెనక్కి పోయే ప్రసక్తి లేదన్నారు. అభివృద్ధి కోసం ఎవరు సలహా ఇచ్చినా స్వీకరిస్తానన్నారు.

  • Loading...

More Telugu News