Suryakumar Yadav: సూర్యకుమార్ ప‌ట్టింది క్లియర్ క్యాచ్.. బౌండరీ లైన్ జర‌ప‌డం వెనుక అస‌లు కార‌ణం ఇదే!

Suryakumar Yadav Catch Controversy of T20 World Cup Final Match

  • టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో సూర్య పట్టిన క్యాచ్‌‌పై నెట్టింట‌ దుమారం
  • ఈ క్యాచ్ అందుకునే క్రమంలో బౌండరీ లైన్ తాకాడనేది కొంద‌రి వాద‌న‌
  • ఉద్దేశపూర్వంగా బౌండరీ లైన్ జరిపారనేది మ‌రో ఆరోప‌ణ‌
  • మైదానంలో పిచ్ మారినప్పుడు అందుకు తగ్గట్లు బౌండరీ లైన్స్ అడ్జస్ట్ చేస్తార‌నేది వాస్త‌వం

టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భార‌త‌ స్టార్ ఆట‌గాడు సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్‌‌పై దుమారం రేగుతున్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా విజయానికి ఆఖ‌రి ఓవ‌ర్‌లో 16 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో సూర్యకుమార్ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్‌లో ఫుల్‌టాస్‌గా వేసిన తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ కొట్టాడు.

దాదాపు సిక్సర్‌గా దూసుకెళ్లిన ఈ బంతిని సూర్య బౌండరీ లైన్‌పై చాకచక్యంగా అందుకున్నాడు. ముందుగా సిక్సర్‌ను అడ్డుకొన్న సూర్య, తర్వాత సమన్వయం కోల్పోవడంతో బంతి గాల్లోకి విసిరేశాడు. ఆ త‌ర్వాత బౌండరీ రోప్ దాటి, మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. 

అయితే, ఈ క్యాచ్ అందుకునే క్రమంలో సూర్య బౌండరీ లైన్ తాకాడనేది కొంద‌రి వాద‌న‌. బౌండరీ రోప్ కదలడం వీడియోలో కనిపిస్తుందని ప‌లువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. అంతేకాకుండా ఉద్దేశపూర్వంగా బౌండరీ లైన్ జరిపారని, తెల్లని లైన్ ఇందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఆరోపణల్లో నిజం లేదు. ఎందుకంటే భారత్ బ్యాటింగ్ చేసిన స‌మ‌యంలో కూడా బౌండ‌రీ వ‌ద్ద ఆ వైట్ లైన్ ఉంది. 

మైదానంలో పిచ్ మారినప్పుడు అందుకు తగ్గట్లు బౌండరీ లైన్స్‌ను అడ్జస్ట్ చేయ‌డం జ‌రుగుతుంద‌ట‌. గత మ్యాచ్‌లో బౌండరీ లైన్ ముందుకు ఉంది. అయితే, ఫైనల్లో పిచ్ మారడంతో బౌండరీ లైన్‌ను అడ్జస్ట్ చేయడంతో వైట్ లైన్ మార్క్ కనిపించింది. అలాగే సూర్య క్యాచ్ ప‌ట్టిన స‌మ‌యంలో కూడా రోప్‌ను తాక‌లేదు. దాంతో సూర్య పట్టింది క్లియర్ క్యాచ్ అని స్పష్టమ‌వుతోంది. ఇదే విష‌యాన్ని మ్యాచ్ స‌మ‌యంలో కామెంట‌రీ బాక్సులో ఉన్న ర‌జ‌నీస్ గుప్తా అనే వ్య‌క్తి కూడా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా వెల్ల‌డించారు.

  • Loading...

More Telugu News