Droupadi Murmu: నీట్ పేప‌ర్ లీకేజీ నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తాం: ద్రౌప‌దీ ముర్ము

Strictest Punishment For NEET Accused says President Droupadi Murmu In Parliament

  • ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము ప్ర‌సంగంలో నీట్ లీకేజీపై స్పందన‌
  • ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • ఈ విష‌యంలో ప్ర‌భుత్వం న్యాయమైన విచారణకు కట్టుబడి ఉందన్న రాష్ట్ర‌ప‌తి
  • ప‌రీక్ష‌ల ప్ర‌క్రియను మ‌రింత స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డి

నీట్ పేప‌ర్ లీకేజీ అంశం దేశ‌వ్యాప్తంగా ఎంత‌టి క‌ల‌క‌లం సృష్టించిందో తెలిసిందే. ఈ అంశంపై పార్ల‌మెంట్‌లో ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన స‌మ‌యంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము స్పందించారు. నీట్ పేప‌ర్ లీకేజీ నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని అన్నారు. అలాగే ప్ర‌భుత్వం న్యాయమైన విచారణకు కట్టుబడి ఉందని తెలిపారు. ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ప‌రీక్ష‌ల ప్ర‌క్రియను మ‌రింత స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

"ఇటీవలి అవకతవకలు, పేపర్ లీక్‌లను దృష్టిలో పెట్టుకుని పరీక్షా విధానాన్ని మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది" అని ముర్ము చెప్పారు. ఇలాంటి సంఘటనలు (ప్రశ్న పత్రాలు లీక్) చాలా రాష్ట్రాల్లో జరిగాయని చెప్పిన రాష్ట్ర‌ప‌తి.. రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ద్రౌప‌దీ ముర్ము అన్నారు.

ఇదిలావుంచితే, నీట్ పరీక్షలో రికార్డు స్థాయిలో 67 మందికి 720 మార్కులు రావ‌డం, అందులోనూ ఒకే కోచింగ్ సెంట‌ర్ నుంచి ఆరుగురికి ఇలా భారీగా మార్కులు స్కోర్ కావ‌డంతో నీట్ పరీక్షపై లీకేజీ అనుమానాలు వెల్లువెత్తాయి. ఆ త‌ర్వాత విచార‌ణ‌లో ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని తేలింది. 'సాల్వర్ గ్యాంగ్‌లు'గా పిలిచే క్రిమినల్ గ్యాంగ్‌లు ఇలా పేప‌ర్ లీకేజీకి పాల్ప‌డిన‌ట్లు తెలిసింది. దీంతో వారిని విచారించే బాధ్యతను ప్ర‌భుత్వం సీబీఐకి అప్పగించింది. 

సీబీఐ విచార‌ణ‌లో భాగంగా ఇప్పటివరకు బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర నుండి ప‌లువురిని అరెస్టు చేశారు. బీహార్ నుండి అరెస్టయిన నలుగురిలో అనురాగ్ యాదవ్, అతని స్నేహితులు పరీక్షకు 24 గంటల ముందు ప్రశ్నపత్రం కాపీలు అందుకున్నట్లు అంగీకరించారు. రాజస్థాన్‌లోని కోటాలోని కోచింగ్ సెంటర్‌లో ప్రిపేర్ అవుతున్న యాదవ్.. తన మామ సాయంతో ప్ర‌శ్న ప‌త్రం పొందిన‌ట్లు తెలిపాడు.

అరెస్టయిన వారిలో బీహార్‌కు చెందిన సనీవ్ ముఖియాను పోలీసులు ప్ర‌ధాన సూత్రధారుడిగా భావిస్తున్నారు. కాగా, మే 5న జరిగిన నీట్ పరీక్షకు దేశ‌వ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక నీట్ వివాదం చెలరేగ‌డంతో ప్రభుత్వం యూజీసీ-నెట్‌ పరీక్ష ఫలితాలను రద్దు చేసిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News