PM Modi: పార్లమెంట్లో రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ మధ్య ఆసక్తికర సన్నివేశం.. ఇదిగో వీడియో!
![PM Modi and Rahul Gandhi shake hands to welcome Om Birla as new Lok Sabha Speaker](https://img.ap7am.com/thumbnail/cr-20240626tn667bd7148c3d4.jpg)
- ఓం బిర్లాకు స్వాగతం పలుకుతూ మోదీ, రాహుల్ గాంధీ కరచాలనం
- లోక్ సభలో ఇండియా కూటమి తరఫున విపక్ష నేతగా రాహుల్ గాంధీ
- దీంతో పార్లమెంట్లో స్పెషల్ ఎట్రాక్షన్గా మారిన కాంగ్రెస్ అగ్రనేత
పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 18వ లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు స్వాగతం పలుకుతూ మోదీ, రాహుల్ గాంధీ కరచాలనం చేసుకున్నారు. ఇక లోక్ సభలో ఇండియా కూటమి తరఫున విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికైన విషయం తెలిసిందే.
దీంతో పార్లమెంట్లో ఆయన స్పెషల్ ఎట్రాక్షన్గా మారారు. మొన్నటి వరకు గుబురు గడ్డంతో కనిపించిన ఆయన ట్రిమ్ చేయించి కొత్తగా కనిపిస్తున్నారు. ఎంపీగా ప్రమాణస్వీకారానికి కూడా టీషర్ట్ ధరించి వచ్చిన రాహుల్.. ఈరోజు ట్రెడిషనల్ పొలిటిషియన్ గెటప్లో ఆకట్టుకున్నారు. తెల్లటి కుర్తాపైజామాలో వచ్చిన ఆయనను కాంగ్రెస్ ఎంపీలతో పాటు, మిగతా పార్టీల నాయకులు కూడా ఆసక్తిగా గమనించారు.
ఇక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్న రాహుల్ గాంధీ ఈ కీలక పదవిలో గాంధీ కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన తల్లి సోనియా గాంధీ 1999 నుండి 2004 వరకు ఈ పదవిలో కొనసాగారు. అలాగే ఆయన తండ్రి రాజీవ్ గాంధీ 1989 నుండి 1990 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.
కొత్త స్పీకర్ ఓం బిర్లాకు ఇరువురు నేతల అభినందనలు
"ఈ కుర్చీకి మీరు తిరిగి ఎన్నికైనందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను" అని ఓం బిర్లాకు మోదీ తెలిపారు. ఈ సందర్భంగా రాబోయే ఐదేళ్లలో బిర్లా నాయకత్వంపై ప్రధాని ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. బిర్లా స్నేహపూర్వక ప్రవర్తనను ఆయన మెచ్చుకున్నారు. ఇది సభలో సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుందని నమ్ముతున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.
"మొత్తం ప్రతిపక్షం, భారత కూటమి తరపున అభినందనలు" అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్రజల అంతిమ గొంతుకగా బిర్లా పాత్రను కాంగ్రెస్ నేత అభివర్ణించారు.