Chandrababu: కుప్పంలో ఎవరైనా రౌడీయిజం చేస్తే అదే వాళ్లకు ఆఖరి రోజు: సీఎం చంద్రబాబు వార్నింగ్

CM Chandrababu speech in Kuppam constituency
  • కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
  • ఎన్టీఆర్ మెమోరియల్ వద్ద భారీ బహిరంగ సభ
  • కుప్పంలో అసాంఘిక శక్తులను ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. ఇక్కడి ఎన్టీఆర్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుప్పం ప్రజలపై వరాల జల్లు కురిపించారు. కుప్పంను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదని ప్రకటించారు. అదే సమయంలో కుప్పంలో అసాంఘిక శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని స్పష్టం చేశారు. కుప్పంలో రౌడీయిజానికి స్థానం లేదని ఉద్ఘాటించారు. 

"నేను 1989లో మొట్టమొదటిసారిగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అప్పట్లో పలమనేరు నుంచి కుప్పంకు నేరుగా రోడ్డు ఉండేది. అది కూడా సింగిల్ రోడ్డు. నాడు టెలిఫోన్లు లేవు, కాలేజీలు లేవు. చిత్తూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతం కుప్పం నుంచే పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. కుప్పంను నా నియోజకవర్గంగా ఎంపిక చేసుకోవడానికి కారణం ఇదే. ఇక్కడ జరిగిన ప్రతి అభివృద్ధి వెనుక టీడీపీ ఉంది. ఈ అభివృద్ధి పనులన్నీ మీ ఎమ్మెల్యేగా నేనే చేశానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. 

2019 నుంచి 2024 వరకు సాగిన పాలనను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అదొక పీడకల వంటిది. అరాచకం, అప్రజాస్వామ్యం... దౌర్జన్యాలు, రౌడీయిజంతో రెచ్చిపోయారు. నా జోలికే వచ్చారంటే పరిస్థితి ఎలా తయారైందో చూడండి. ఎక్కడో కేజీఎఫ్ అనుకుంటే... అక్కడ బంగారం గనులు వచ్చాయి... కానీ కేజీఎఫ్ ను మరిపించేలా కుప్పంలో గ్రానైట్ దోపిడీ జరిగింది. అప్పుడు నేను మాజీ ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా, ఎమ్మెల్యేగా ఉన్నాను... నాకే దిక్కులేదు. నాడు నేను కుప్పంకు వస్తుంటే జీవో నెం.1 తీసుకువచ్చారు. మనపైనే దాడులు చేసి, మనవాళ్ల మీదనే కేసులు పెట్టారు. ఇవన్నీ నేను మర్చిపోతానా? 

జీవితంలో మొట్టమొదటిసారిగా జైలుకు వెళ్లి మనవాళ్లను పరామర్శించే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత నన్ను కూడా జైల్లో పెట్టారు. బాధ, ఆవేదన ఉంది తప్ప, నాకు ఎవరి మీద కోపం లేదు. ప్రజలపై అభిమానం ఉంది. ఇవాళ ఇక్కడున్న ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెబుతున్నా... ఎవరైనా కుప్పంలో రౌడీయిజం చేశారంటే అదే వాళ్లకు చివరి రోజు అవుతుంది... జాగ్రత్త. రౌడీయిజం కానీ, గంజాయి కానీ, అక్రమ వ్యాపారాలు కానీ... ఈ ప్రశాంతమైన కుప్పంలో చేయడానికి వీల్లేదు. 

రాబోయే ఐదేళ్లకు నా వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉంది. సంక్షేమానికి పెద్దపీట వేస్తాం... అభివృద్ధిని పరిగెత్తిస్తాం. అందుకు కుప్పం నియోజకవర్గాన్ని నమూనాగా మార్చుతాం. కుప్పం మున్సిపాలిటీకి రూ.100 కోట్లు ఇస్తామని మొన్న చెప్పాను... ఇప్పుడు చెబుతున్నా... రూ.100 కోట్లు కాదు, ఎంతైనా సరే ఈ కుప్పం మున్సిపాలిటినీ ఒక మోడల్ మున్సిపాలిటీగా చేస్తాం. 

కుప్పంకు అవుటర్ రింగ్ రోడ్డు వేస్తాం. టౌన్ లో అన్ని రోడ్లు వేస్తాం. కాలనీలో ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తాం. డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను... జంక్షన్ లు కూడా ఏర్పాటు చేసి ఒక పరిశుభ్రమైన నగరంగా కుప్పంను మరింత అభివృద్ధి చేసే బాధ్యత నాది. కుప్పం మాత్రమే కాకుండా నియోజకవర్గంలోని నాలుగు మండలాలను అభివృద్ధి చేస్తాను. ఒక్కో మండల కేంద్రానికి రూ.10 కోట్లు తక్కువ కాకుండా ఖర్చు పెట్టి, వాటిని ఆదర్శ పట్టణాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. 

ఇక, మేజర్ పంచాయతీ అయితే రూ.2 కోట్లు, మైనర్ పంచాయతీ అయితే రూ.1 కోటి ఖర్చు పెడతాం. ఆ పని ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుందని హామీ ఇస్తున్నా. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మినరల్ వాటర్ అందిస్తాం. అన్ని గ్రామాలకు రోడ్లు వేయిస్తాం, పొలాలకు కూడా రోడ్లు వేయించే బాధ్యత తీసుకుంటాం. 

ఇప్పుడే హంద్రీనీవా కాలువ పరిశీలించాను. నాడు మన నాయకుడు ఎన్టీఆర్ తీసుకువచ్చారు. నేను ఆ రోజు వి.కోట వరకు నీళ్లు తీసుకువచ్చాను. కానీ ఈ వైసీపీ గత ఐదేళ్లలో ఐదు కిలోమీటర్ల మేర కాలువ పనులు చేయగలిగారు. ఆ రోజు హంద్రీనీవా సినిమా సెట్టింగులు వేశారు... అందరూ చూశారు కదా! ట్యాంకర్లతో నీళ్లు తీసుకువచ్చి, ఆ నీళ్లు కాలవలో పోసి ప్రారంభోత్సవం అంటూ హడావుడి చేశారు. ముఖ్యమంత్రి పర్యటన అయిపోగానే, ఆ గేట్లను కూడా తీసుకుపోయారు. ఈ సంవత్సరం హంద్రీనీవా కాలువలో కృష్ణా నది నీళ్లు వస్తాయి. వైసీపీకి కాంట్రాక్టర్లపై ఉండే ప్రేమ రైతులపై లేదు. త్వరలోనే దీనిపై శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. 

ఇక్కడ మంచి వాతావరణం ఉంది. ఇక్కడ పండని పంట లేదు. పట్టు పరిశ్రమ, పండ్లు, వాణిజ్య పంటలకు చిరునామా కుప్పం. ఈ ఏడాది టమాటా పంట వేశారు... మంచి లాభాలు వచ్చాయి. కుప్పం నియోజకవర్గ పరిధిలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం. కుప్పంకు త్వరలోనే ఎయిర్ పోర్టు వస్తుంది. ఇక్కడ్నించి పంటలను ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు రవాణా చేస్తాం. మున్ముందు కుప్పం రైల్వే జంక్షన్ లా మారే అవకాశం ఉంది. కుప్పంకు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తాం. 

ఈ ఎన్నికల్లో వచ్చిన మా అభ్యర్థులకు వచ్చిన మెజారిటీలు చూసి నాకే ఆశ్చర్యం కలిగింది. గాజువాక, భీమిలి, మంగళగిరిలో 90 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. వైసీపీ అరాచకాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వైసీపీ ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని ప్రజలు భయపడ్డారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగులు, యువత, మహిళలు పూర్తిగా మనవైపే నిలిచారు. 

రాబోయే కాలంలో అన్నీ మంచి రోజులే. కానీ సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. నేను మోయలేనంత భారం ఉంది. ఖజానా ఖాళీ అయింది... ఎలా పాలన చేస్తారు అంటున్నారు. అయినప్పటికీ నాకు నమ్మకం ఉంది... నాకు మనోధైర్యం ఉంది... ఎన్ని కష్టాలైనా పడతా... ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తా" అని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News