Hanuma Vihari: విహారీ తిరిగొచ్చేయ్... నీకు మా పూర్తి సహకారం ఉంటుంది: మంత్రి నారా లోకేశ్

Team India cricketer Hanuma Vihari met AP minister Nara Lokesh

  • మంత్రి నారా లోకేశ్ ను కలిసిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారి
  • లోకేశ్ కు శుభాకాంక్షలు తెలిపిన విహారి
  • విహారితో భేటీ సంతోషం కలిగించిందన్న మంత్రి లోకేశ్
  • గత ప్రభుత్వ హయాంలో అతడు రాజకీయ దౌర్జన్యానికి గురయ్యాడని వెల్లడి
  • విహారి తిరిగి ఆంధ్రాకు వచ్చేయాలని లోకేశ్ సూచన

టీమిండియా క్రికెటర్ హనుమ విహారి నేడు ఏపీ మంత్రి నారా లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలిశాడు. పుష్పగుచ్ఛం అందించి మంత్రి లోకేశ్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందించారు. 

"ఇవాళ భారత క్రికెటర్ హనుమ విహారిని కలవడం సంతోషం కలిగించింది. అతడు రాజకీయ దౌర్జన్యం బారినపడిన వ్యక్తి. గత ప్రభుత్వ హయాంలో వేధింపుల కారణంగా ఆంధ్రా క్రికెట్ ను వదిలి వెళ్లే పరిస్థితులు సృష్టించడం సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ కు తిరిగి రావాలని, మరోసారి తెలుగు ప్రజలు గర్వించేలా క్రికెట్లో రాణించాలని నేను హనుమ విహారిని కోరాను. అతడికి మా సంపూర్ణ సహకారం ఉంటుంది" అని నారా లోకేశ్ పేర్కొన్నారు.

"మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అవమానకర రీతిలో ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీని వదులుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్, తెలుగు తేజం హనుమ విహారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశేష గౌరవంతో తిరిగి స్వాగతం పలుతోంది. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు అనే ప్రాథమిక సూత్రాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తించిన వారిని ప్రజలు తిరస్కరించారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడైన పి.శరత్ చంద్రారెడ్డిని ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమించుకోవడంతో గత ప్రభుత్వం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో ‘రాజకీయ క్రీడ’ మొదలుపెట్టింది. తమ పార్టీ నాయకుడి కుమారుడు, జట్టులో 17వ ఆటగాడు అయిన కుంట్రపాకం పృధ్వీరాజ్ ను ప్రోత్సహించేందుకు అసమాన ప్రతిభాపాటవాలు ఉన్న హనుమ విహారి లాంటి క్రికెటర్ ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా వేధించింది, అవమానించింది. 

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రవర్తించిన తీరుతో విసిగిపోయిన హనుమ విహారి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే చంద్రబాబునాయుడు గారు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారు, నేను స్పందించి, హనుమ విహారికి అండగా ఉన్న విషయం మీకు తెలిసిందే. #WeStandWithHanuma పేరుతో సోషల్ మీడియాలో విశేష స్పందన వచ్చింది కూడా. క్రికెట్ అభిమానులు ఎందరో హనుమ విహారికి సంఘీభావం తెలిపారు. 

హనుమ విహారి తన క్రికెట్ అనుభవాన్ని ఇతరులకు నేర్పేందుకు కూడా ఆనాటి వ్యవస్థ అడ్డుపడింది. దేశంలోని ఇతర రాష్ట్రాల క్రికెట్ జట్టుకు నేతృత్వం/ప్రాతినిధ్యం వహించేలా 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' ఇచ్చేందుకు నిరాకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభంజనం చూసిన తర్వాతే హనుమ విహారికి 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' ఇచ్చారంటే ఏ స్థాయిలో కక్షపూరితంగా వ్యవహరించారో అర్ధం చేసుకోవచ్చు. 

రాజకీయాలకు అతీతంగా క్రీడలను ప్రోత్సహించడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుంటుంది. అన్ని ఆటల్లో క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటాం. క్రికెటర్ హనుమ విహారికి పూర్తి న్యాయం చేసేందుకు మాట ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉంది" అంటూ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News