Revanth Reddy: చంద్రబాబుతో పోటీ పడే అవకాశం వచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి
![CM Revanth Reddy Interesting Comments on CM Chandrababu Naidu](https://img.ap7am.com/thumbnail/cr-20240622tn6676f266d5cd0.jpg)
- బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
- బాబుతో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం తనకు వచ్చిందన్న రేవంత్
- గతంలో 12 గంటలే పనిచేస్తే చాలనుకునేవాడినన్న సీఎం
- కానీ ఇప్పుడు చంద్రబాబులా 18 గంటలు పని చేస్తూ ఆయనతో పోటీ పడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని వ్యాఖ్య
మనకు గుర్తింపు రావాలంటే సమర్దుడైన ఆటగాడితో పోటీపడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. "పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు నడిపే అవకాశం నాకు వచ్చింది. గతంలో నేను 12 గంటలే పనిచేస్తే చాలనుకునేవాడిని. కానీ ఇప్పుడు మనం కూడా చంద్రబాబులా 18 గంటలు పని చేస్తూ ఆయనతో పోటీ పడదామని అధికారులు, సహచరులతో చెప్పాను" అని బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
శనివారం బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి తెలంగాణలో త్వరలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో 500 నుంచి 1000 ఎకరాల్లో వైద్యరంగంలో రాణించిన సంస్థలకు అవకాశం ఇస్తామన్నారు. అన్ని రకాల జబ్బులకు సంబంధించి ఇక్కడే వైద్యం అందేలా హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఇక సంకీర్ణ రాజకీయాలకు పునాది వేసింది ఎన్టీఆరే అని రేవంత్ అన్నారు. కిలో బియ్యం రూ. 2కు, జనతా వస్త్రాలు వంటి అనేక సంక్షేమ పథకాలను ఆయన ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. సినీ రంగాన్ని బాలకృష్ణ చూసుకుంటారని, ఆయన అల్లుళ్లు లోకేశ్, భరత్ రాజకీయాలు, సంక్షేమం బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.