YS Sharmila: చంద్రబాబు వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే విషయాన్ని మోదీ గుర్తించాలి!: వైఎస్ షర్మిల

YS Sharmila suggetion to Chandrababu

  • చంద్రబాబు ప్రత్యేక హోదా సహా విభజన హామీలను అమలయ్యేలా చూడాలన్న షర్మిల
  • హానీమూన్ పీరియడ్ తీసుకునే సమయం కూడా చంద్రబాబుకు లేదని వ్యాఖ్య 
  • జగన్‌కు వ్యతిరేకంగా వెళదామనే నినాదంతో ఓట్లు పడ్డాయని వ్యాఖ్య
  • వైఎస్ విగ్రహాలపై దాడులను ఖండించిన షర్మిల
  • వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పారు... ఇక నేనేం చెప్పాలని వ్యాఖ్య 

ప్రజల తీర్పును గౌరవిస్తూ చంద్రబాబుకు మరోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూనే... ఆయనకు పలు విషయాలను గుర్తు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజల ఊపిరి అన్నారు. హోదా విషయంలో బీజేపీ మనల్ని మోసం చేసిందని విమర్శించారు. 2015లో ఇచ్చిన హామీని ఈ రోజు వరకు నెరవేర్చలేదన్నారు. అయితే ఈరోజు చంద్రబాబు మద్దతు ఇస్తున్నందువల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే విషయాన్ని మోదీ గుర్తుంచుకోవాలన్నారు.

చంద్రబాబు మద్దతు ఇచ్చి ఉండకపోతే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండకపోయేదన్నారు. ఢిల్లీలో తాము పీఠం ఎక్కడానికి ఏపీ ప్రజలే కారణమని మోదీ గుర్తించాలన్నారు. తన వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే విషయాన్ని చంద్రబాబు గుర్తించి... ప్రత్యేక హోదా సాధించుకు రావాలని డిమాండ్ చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. విభజన చట్టంలో పెట్టిన వాటిలో చాలా వాటిని సాధించుకోవాల్సి ఉందన్నారు. రాజధాని, పోర్టులు, కడపలో స్టీల్ ప్లాంట్... ఇలా ఎన్నింటినో చంద్రబాబు సాధించాల్సి ఉందన్నారు.

హానీమూన్ పీరియడ్ తీసుకునే సమయం లేదు

ఇక, ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని... వాటిని ఎలా అమలు చేస్తారో... ఎప్పుటి నుంచి ప్రారంభిస్తారో చెప్పాలన్నారు. చంద్రబాబు ఇప్పుడే గెలిచారని తమకు తెలుసునని... కానీ ఏపీ వెనుకబడిన రాష్ట్రం కాబట్టి వారు హనీమూన్ పీరియడ్ తీసుకునే పరిస్థితి కూడా లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు.

జగన్‌కు వ్యతిరేకమనే ఒకే నినాదంతో ఓట్లు పడ్డాయి

ఇటీవలి సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జగన్‌కు వ్యతిరేకంగా అనే ఒకే నినాదంతో జరిగాయన్నారు. అందుకే ఎన్డీయే కూటమి విజయం సాధించిందన్నారు. ఓటు వృథా కావొద్దు... ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు కంకణం కట్టుకున్నందువల్లే కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఓట్లు సాధించలేదన్నారు. 2029 నాటికి తాము మంచి స్థాయికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అయినా వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని... ఇక తాను మాట్లాడాల్సింది ఏముంటుందన్నారు.

దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర కారణంగా కాంగ్రెస్ మంచి సీట్లు గెలుచుకుందన్నారు. బీజేపీ చేస్తోన్న అరాచకాలను ప్రజలు గుర్తించారని... అందుకే ఆ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లు రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ ఎన్నాళ్లు అధికారంలో ఉంటుందో చెప్పలేమన్నారు. ఈరోజు ఢిల్లీలో పవర్ బీజేపీ చేతిలో లేదన్నారు. బీజేపీ ఇతర పార్టీలపై ఆధారపడి ఉందన్నారు.

వైఎస్ విగ్రహాలపై దాడులు దారుణం

ఒక పార్టీ ఓడిపోయినందుకు వైఎస్ విగ్రహాలపై దాడులు దారుణమని షర్మిల అన్నారు. వైఎస్ మహానాయకుడని... ప్రజలకు ఎంతో సేవ చేసిన నాయకుడన్నారు. అలాంటి మహానాయకుడు చనిపోతే... అది తట్టుకోలేక 7 వేల మంది ప్రజలు చనిపోయారన్నారు. అందుకే చనిపోయిన వారికి రాజకీయాలు ఆపాదించవద్దని కోరారు. 'దయచేసి వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేయడం ఆపండి.. వారు చేశారని మీరు... మీరు చేశారని వాళ్లు.. ఇలా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ వెళ్తే దీనికి అంతే ఉండదు. మళ్లీ చెబుతున్నాను... మీకు, ఇంకొకరికి తేడా ఉండాలంటే కొంచెం ఓపిక పట్టాలి' అని సూచించారు.

వైసీపీకి చెందిన చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి షర్మిల స్పందిస్తూ... 'పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే... అది ఎండిపోతే తప్ప' అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. జగన్ అయిదేళ్లు అధికారంలో ఉండి ప్రత్యేక హోదా తేలేకపోయారన్నారు.

  • Loading...

More Telugu News