APMDC: అర్ధరాత్రి గ‌నుల శాఖ‌, ఏపీఎండీసీ కార్యాల‌యాలు సీజ్

APMDC Office Seized by Police

  • గనుల శాఖ డెరెక్టర్‌గా, ఎండీసీ ఎండీగా యువరాజ్‌ బాధ్యతల స్వీకరణ
  • ఇప్ప‌టికే ఏపీఎండీసీ వైస్ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డిపై బ‌దిలీ వేటు
  • గ‌నుల శాఖ‌పై వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో భారీ అవినీతి జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు

గనుల శాఖ డైరెక్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) వైస్ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా జంట ప‌ద‌వులు నిర్వ‌హిస్తున్న‌ వెంకటరెడ్డిపై శుక్రవారం రాత్రే ప్రభుత్వం బ‌దిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. అలా ఆయ‌న బ‌దిలీ అయిన వెంట‌నే పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. 

అర్ధ‌రాత్రి ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలోని గ‌నుల‌శాఖ కార్యాల‌యం, తాడిగ‌డ‌ప స‌మీపంలోని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాల‌ను ప్రభుత్వం త‌మ అధీనంలోకి తీసుకుని సీజ్‌ చేసింది. కార్యాలయంలోని అన్ని విభాగాలను పోలీసులు సోదాలు చేసి పూర్తిగా త‌మ‌ స్వాధీనంలోకి తీసుకున్నారు. 

కీలకమైన ఫైళ్లు, హార్డ్‌డిస్క్‌లు, ఇతర సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకే ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స‌మాచారం. ప్రభుత్వం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వరకు ఆఫీసు మూసేఉంటుందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.

కాగా, గ‌నుల శాఖ ఆధ్వ‌ర్యంలో ఇష్టానుసారంగా బీచ్‌శాండ్‌, బెరైటీస్‌, ఇసుక, బొగ్గు, ఇతర ఖనిజాల వేలం, టెండర్లు, అమ్మకాలు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌ద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. వైసీపీ ముఖ్యుల‌కు వెంక‌ట‌రెడ్డి భారీ ల‌బ్ధి చేకూర్చార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 

మరోవైపు గనుల శాఖ డెరెక్టర్‌గా, ఎండీసీ ఎండీగా యువరాజ్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీఐఐసీ భవనంలోని తన కార్యాలయంలో గనుల శాఖ అధికారుల సమక్షంలో ఆయ‌న‌ చార్జ్‌ తీసుకున్నారు. అనంతరం గనుల శాఖ కార్యకలాపాలు, చేపట్టిన ప్రాజెక్టులు, కీలక అంశాలపై రెండు గంటలపాటు సమీక్ష చేశారు.

  • Loading...

More Telugu News