bengaluru: నడి వేసవిలో బెంగళూరును ముంచెత్తిన వర్షం.. నగరవాసుల హర్షం

Bengaluru residents rejoice first heavy rain

  • గత కొంతకాలంగా నగరాన్ని వేధించిన తీవ్ర నీటి కొరత
  • ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రజల కేరింతలు
  • సోషల్ మీడియాతో ఆనందం పంచుకున్న వైనం

గార్డెన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో ఇటీవలి నీటి కొరతతో నగరవాసులు అల్లాడారు. ఇళ్లలో రోజువారీ అవసరాలు తీర్చుకొనేందుకు నీరు దొరక్క నానా కష్టాలు పడ్డారు. కొందరు ఏకంగా అపార్ట్ మెంట్లను ఖాళీ చేయగా మరికొందరు సమీపంలోని మాల్స్ కు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

కానీ నడివేసవిలో ఉన్నట్టుండి నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది.  దాదాపు 5–6 నెలల తర్వాత బెంగళూరులో శుక్రవారం తొలిసారి వర్షం కురిసింది. దీంతో బెంగళూరువాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎండలు, ఉష్ణోగ్రతల నుంచి ఊరట లభించిందని తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. వర్షం ఫొటోలు, వీడియోలను నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. మరికొందరేమో వర్షం నీటిని వృథా కానీయకుండా ఇంకుడు గుంతల్లోకి పంపుతున్న వీడియోలను పోస్ట్ చేశారు. 

‘దాదాపు 6 నెలల నిరీక్షణ తర్వాత బెంగళూరులో ఎట్టకేలకు వర్షం కురిసింది. ఎండల వేడి నుంచి ఊరటనిచ్చింది. దీంతో క్యాంపస్ లోని మా వాలంటీర్లు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు. వర్షంలో కేరింతలు కొట్టారు. ప్రకృతి పునరుద్ధరణ సంకేతం ఎంతో ఊరటను, ఆశను కలిగిస్తోంది. ఇక చల్లని రోజులు వస్తాయనే హామీ ఇస్తోంది’ అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది.

కానీ మరికొందరు యూజర్లు మాత్రం వర్షం వల్ల రోడ్లపై నీరు నిలవడంతో మున్సిపల్ అధికారుల తీరును తప్పుబట్టారు. గత ఆరు నెలలుగా వర్షాలు లేకపోయినా డ్రైనేజీలు, నాలలను శుభ్రం చేయకుండా అధికారులు నిద్రపోయారంటూ విమర్శించారు. రోడ్లపై నీరు నిలిచిపోవడం వల్ల చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయని మండిపడ్డారు. మరికొందరమో నగరంలో భిన్న పరిస్థితుల గురించి పోస్ట్ చేశారు. ‘నగరంలో వర్షాలు కురవకపోతే ప్రజలు నీళ్లు లేక అల్లాడతారు. కానీ ఒకవేళ వర్షాలు కురిస్తే నీళ్లు నిలిచిపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి ఇదేనా?’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.


bengaluru
heavy rain
residents
enjoy
Social Media
posts

More Telugu News