YS Vijayamma: అమ్మ అమెరికా ఎందుకు వెళ్లిందంటే..?: వైఎస్ షర్మిల

YS Sharmila On YS Vijayamma America Tour

  • జగన్ కు, నాకు మధ్య సమదూరం పాటిస్తోందని వెల్లడి
  • వైఎస్ విజయమ్మ న్యూట్రల్ గా ఉందన్న షర్మిల
  • ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు, జగన్ ఫెయిల్

కొడుకు అధికార పార్టీ, కూతురేమో ప్రతిపక్షం.. ఇద్దరిలో ఎవరికి మద్దతు తెలపాలనే ప్రశ్న ఎదురైతే జవాబివ్వడం అంత తేలిక కాదని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈమేరకు ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండగా తన తల్లి వైఎస్ విజయమ్మ అమెరికా ఎందుకు వెళ్లారనే ప్రశ్నకు జవాబిచ్చారు. తనకు, తన సోదరుడు జగన్ కు మధ్య రాజకీయంగా పోటీ అనివార్యం కావడంతో ఎవరివైపు నిలబడాలనే ప్రశ్న తన తల్లికి ఎదురైందని చెప్పారు. అయితే, ఎవరో ఒకరి వైపు ఉండడం కన్నా ఇద్దరికీ సమదూరం పాటించడం, ఏ ఒక్కరి స్టాండ్ తీసుకోకపోవడమే మేలని విజయమ్మ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన తల్లి విజయమ్మ దేశంలో ఉండకుండా అమెరికా వెళ్లిపోయిందని వివరించారు.

ప్రత్యేక హోదా విషయం మరిచారు..
ఆంధ్రప్రదేశ్ కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తో కానీ ఎలాంటి ఉపయోగం లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వాళ్లిద్దరూ ఘోరంగా ఫెయిలయ్యారని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మాటమార్చారని, ప్రత్యేక హోదా హామీతో అధికారం దక్కించుకున్న వైఎస్ జగన్ కూడా ఎన్నికలయ్యాక  ప్రత్యేక హోదా విషయం మరిచిపోయారని విమర్శించారు. వీరి వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగంలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అత్యవసరమని, ప్రజల కష్టాలను తొలగించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా చేయాలని రాహుల్ గాంధీ తపనపడుతున్నాడని షర్మిల చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీలో పర్యటించినపుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రాధాన్యతా అంశంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని షర్మిల గుర్తుచేశారు.


YS Vijayamma
YS Sharmila
Congress
Jagan
Vijayamma USA
America Tour
Viral Videos

More Telugu News