Revanth Reddy: సీతక్క రిక్వెస్ట్‌తో ఇక్కడ సోనియాగాంధీ ఆమెకు టిక్కెట్ ఇచ్చారు: ఆదిలాబాద్‌లో రేవంత్ రెడ్డి

Revanth Reddy election campaign in Adilabad

  • సామాన్య మహిళా ప్రభుత్వ ఉద్యోగి సుగుణకు టిక్కెట్ ఇచ్చామన్న రేవంత్ రెడ్డి
  • పోడు భూముల సమస్యపై కేసీఆర్ దృష్టి పెట్టలేదని ఆరోపణ
  • బీజేపీ, బీఆర్ఎస్ లంబాడ, గోండుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శ
  • ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే సుగుణను గెలిపించాలని విజ్ఞప్తి

ఆదిలాబాద్ నుంచి తాము మహిళకు, సామాన్య ప్రభుత్వ ఉద్యోగికి ఎంపీ టిక్కెట్ ఇచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి సీతక్క రిక్వెస్ట్‌తో సోనియా గాంధీ ఆత్రం సుగుణ అనే ఆడబిడ్డకు టిక్కెట్ ఇచ్చారని తెలిపారు. మీ తరఫున సీతక్క ఉంటారని.. మీ తరఫున సుగుణ నిలబడ్డారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే సుగుణకు అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆమెకు డబ్బులు ఉన్నాయని టిక్కెట్ ఇవ్వలేదని, చదువుకున్నారని, ఆదిలాబాద్ సమస్యలపై అవగాహన ఉందని ఇచ్చామన్నారు.

గురువారం ఆయన ఆసిఫాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పోడు భూముల సమస్యపై కేసీఆర్ దృష్టి పెట్టలేదని ఆరోపించారు. ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి బీజేపీ కృషి చేయలేదన్నారు. కేంద్రమంత్రివర్గంలోనూ గోండులకు స్థానం దక్కలేదని విమర్శించారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గోండులు, లంబాడ హక్కులను కాలరాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు ఆదిలాబాద్ లోక్ సభ టిక్కెట్‌‌ను మహిళలకు ఇవ్వలేదన్నారు. కానీ కాంగ్రెస్ సామాన్య మహిళా ఉద్యోగికి టిక్కెట్ ఇచ్చిందన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో సోయం బాపురావును గెలిపిస్తే ఆదిలాబాద్‌కు చేసిందేమీ లేదన్నారు. చివరకు ఈ ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రస్తుత బీజేపీ అభ్యర్థి నగేశ్, బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు చేసిందేమీ లేదన్నారు.

తుమ్మడిహట్టి ప్రాజెక్టు‌ను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారన్నారు. సీసీఐ మూతపడితే కేసీఆర్, మోదీ పట్టించుకోలేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా వనరులు ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తోందన్నారు. విద్యా, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు.

Revanth Reddy
Congress
Adilabad District
Lok Sabha Polls
  • Loading...

More Telugu News