Sai Charan: ఫార్మా కంపెనీ అగ్నిప్రమాదంలో ఆరుగురి ప్రాణాలు కాపాడిన బాలుడికి సీఎం రేవంత్ రెడ్డి సన్మానం
![CM Revanth Reddy felicitates Sai Charan who saved six labour lives from fire accident](https://imgd.ap7am.com/thumbnail/cr-20240428tn662e41f2ccf45.jpg)
- గత శుక్రవారం నాడు రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం
- ప్రమాద సమయంలో కంపెనీలో 50 మంది కార్మికులు
- కొందరు కిటికీల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న వైనం
- ధైర్యంగా భవనంపైకి ఎక్కి తాడు కట్టిన బాలుడు సాయిచరణ్
- తాడు పట్టుకుని బయటికి వచ్చిన మిగిలిన కార్మికులు
రంగారెడ్డి జిల్లా నందిగామలో గత శుక్రవారం నాడు ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వారిలో చాలామంది కిటికీల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరు బయటికి రాలేక చిక్కుకుపోగా, ఓ బాలుడి సమయస్ఫూర్తి వారిని కాపాడింది.
నందిగామకు చెందిన సాయిచరణ్ అనే బాలుడు ఎంతో సాహసోపేతంగా ఫార్మా కంపెనీ భవనంపైకి ఎక్కి తాడు కట్టడంతో, ఆ తాడును పట్టుకుని ఆరుగురు కార్మికులు సురక్షితంగా బయటికి రాగలిగారు. బాలుడు సాయిచరణ్ ను పోలీసులు, అగ్నిమాపకసిబ్బంది, ఇతరులు ఎంతగానో అభినందించారు.
కాగా, సాయిచరణ్ సాహసానికి సంబంధించిన సమాచారం తెలంగాణకు సీఎంవోకు కూడా చేరింది. నేడు ఆ బాలుడ్ని తన కార్యాలయానికి పిలిపించిన రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. బాలుడి తల్లిదండ్రులతోనూ రేవంత్ మాట్లాడారు.
కార్మికులను కాపాడడంలో ప్రదర్శించిన తెగింపు వివరాలను రేవంత్ రెడ్డి బాలుడు సాయిచరణ్ ను అడిగి తెలుసుకున్నారు. బాలుడి ధైర్యసాహసాల పట్ల సీఎం ముగ్ధుడయ్యారు.
![](https://img.ap7am.com/froala-uploads/20240428fr662e41e5d4ec2.jpg)