Revanth Reddy: 40 శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతారా? తోక జాడిస్తే కత్తిరించేందుకు కత్తెర నా చేతిలోనే ఉంది: రేవంత్ రెడ్డి హెచ్చరిక

Revanth Reddy in Mahaboonnagar palamuru praja deevena sabha

  • ప్రభుత్వాన్ని కూలదోసే దమ్ము ఎవరికీ లేదన్న రేవంత్ రెడ్డి
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి మంచిది కాదని వ్యాఖ్య
  • భవిష్యత్తులో ప్రధాని కనుక సహకరించకపోతే చాకిరేవు పెడతానని హెచ్చరిక

ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వస్తే ఆరు నెలలు కూడా ఉండనీయరా? 40 శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతారా? పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదా? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మహబూబ్ నగర్‌లో పాలమూరు ప్రజాదీవెన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ ప్రభుత్వాన్ని కూలదోసే దమ్ము ఎవరికీ లేదన్నారు. పదేళ్లు పాలించిన వారు రెండు నెలలకో ప్రభుత్వాన్ని కూలగొడతామని అంటున్నారని మండిపడ్డారు. ఎవరైనా తోక జాడిస్తే కత్తిరించే కత్తెర తన చేతిలోనే ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులు, పార్టీలను చీల్చడమే బీఆర్ఎస్ విధానమా? అని మండిపడ్డారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి మంచిది కాదన్నారు. మన వద్దకు అతిథి వస్తే గౌరవించాల్సిన బాధ్యత ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రధానిని సహకరించమని కోరడంలో తప్పేముందని నిలదీశారు. భవిష్యత్తులో ప్రధాని కనుక సహకరించకపోతే చాకిరేవు పెడతానని హెచ్చరించారు. మోడీతో అయినా... కేడీతో అయినా కొట్లాడుతానన్నారు. మనం ఇచ్చే మర్యాద మన రాష్ట్రానికి మేలు జరగాలని మాత్రమే అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణను లూటీ చేసిందని ఆరోపించారు. కుర్చీ వేసుకొని ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న కేసీఆర్ అలా చేయలేదు కానీ మందేసి పామ్ హౌస్‌లో పడుకున్నారని ఆరోపించారు. తనపై అసూయతో విషం కక్కుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు ఒంట్లో బాగా లేక అసెంబ్లీకి రాలేదని చెబుతున్నారని... మరి నల్గొండ సభకు ఎలా వెళ్లారు? అని ప్రశ్నించారు. మూడు నెలల పాలనలోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ జిల్లా నుంచి రెండు సీట్లలో కాంగ్రెసే గెలవాలన్నారు. తమ 90 రోజుల పాలనకు లోక్ సభ ఎన్నికల ఫలితాలు రెఫరెండమన్నారు.

మా ప్రభుత్వం మీదకు ఎవరైనా వస్తే తొక్కుకుంటూ వెళ్లి బొంద పెడతామని హెచ్చరించారు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి అని ఎద్దేవా చేశారు. గద్వాలకు నీళ్లు తెస్తానన్న కేసీఆర్ ఎందుకు తీసుకు రాలేదో చెప్పాలన్నారు. పాలమూరుకు ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తామని చెప్పారు.

బీఆర్ఎస్‌తో కలిసి వెళతామని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీరును రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. తన పూర్వీకులు రాజకీయ నాయకులు, సీఎంలు కాలేదని కేటీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం లేదన్నారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ పదేళ్లు అధికారంలో ఉన్నారని... ఇక కాంగ్రెస్ కూడా పదేళ్లు అధికారంలో ఉండి తీరాలన్నారు.

  • Loading...

More Telugu News