Hyderabad: పాతబస్తీలో యువతిపై అత్యాచారం.. గంటల వ్యవధిలో నిందితుల అరెస్ట్

woman sexually assualted in hyderabad culprits taken into custody

  • బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి ఘటన
  • సోదరుడితో గొడవపడి రాత్రివేళ హైదరాబాద్‌కు వచ్చిన సూర్యాపేట యువతి
  • యువతిని పోలిస్ స్టేషన్‌కు తీసుకెళతామని చెప్పి గోడౌన్‌లో అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులు
  • బాధితురాలి ఆక్రందనలతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించిన వైనం
  • వెంటనే నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 

హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం జరిగింది. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళతామని చెప్పి ఓ యువతిపై ఇద్దరు నిందితులు అత్యాచారానికి ఒడిగట్టారు. శనివారం అర్ధరాత్రి బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలో నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సూర్యాపేటకు చెందిన యువతి (21) తన సోదరుడు, తల్లితో కలిసి నివసిస్తోంది. శనివారం బాధితురాలికి తన సోదరుడితో ఏదో విషయమై గొడవ జరగ్గా అతడు ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో, యువతి మనస్తాపానికి గురై బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరింది. రాత్రి 10.40కి ఎంజీబీఎస్ బస్‌స్టాండ్‌లో దిగిన ఆమె సమీపంలోని టీకొట్టులో టీ తాగి అఫ్జల్‌గంజ్‌వైపు నడుచుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలో గౌస్‌నగర్‌కు చెందిన ములకపెంట శ్రీకాంత్ (22), అఫ్జల్ గంజ్‌కు చెందిన పానగంటి కాశీవిశ్వనాథ్‌లు (32) ఆమెను ద్విచక్రవాహనంపై వెంబడించారు. బాధితురాలిని సమీపించిన వారు ఎక్కడికెళ్లాలని అడగ్గా ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నట్టు చెప్పింది. తాము పోలీస్ స్టేషన్‌ వద్ద దిగబెడతామని చెప్పి ఆమెను బైక్ ఎక్కించుకున్నారు. ఆ తరువాత ఓ ప్రాంతంలో ఆమెకు ఐస్‌క్రీమ్ తినిపించి తమపై నమ్మకం కలిగేలా చేశారు. 

ఆ తరువాత బాధితురాలిని లేక్‌వ్యూ హిల్స్ సమీపంలోని ఉన్న శ్రీకాంత్‌కు చెందిన స్క్రాప్ గోడౌన్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బైక్‌పై మరో చోటుకి తరలిస్తుండటంతో యువతి పెద్దపెట్టున అరిచింది. స్థానికులు అప్రమత్తం కావడం చూసిన నిందితులు యువతిని అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. 

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. తనపై అఘాయిత్యం జరిగిన గోడౌన్‌ను యువతి పోలీసులకు చూపించింది. ఆ గోడౌన్.. నిందితుల్లో ఒకరైన శ్రీకాంత్‌దని తెలుసుకున్న వారు అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా కాశీవిశ్వనాథ్‌ను కూడా అరెస్టు చేశారు. నిందితులిద్దరూ బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు తేలింది. ఈ క్రమంలో యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News