Tablighi Jamaat: తబ్లీఘీ జమాత్‌కు తెలంగాణ ప్రభుత్వ నిధుల మంజూరు.. భగ్గుమన్న బండి సంజయ్

Bandi Sanjays tweet on Congress government

  • వికారాబాద్‌లో తబ్లీఘీ జమాత్‌ సమావేశాలకు ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయన్న సంజయ్
  • రాష్ట్రం దివాల తీసిందన్న ప్రభుత్వం తబ్లీఘీకి నిధులు ఎలా మంజూరు చేసిందని ప్రశ్న
  • సీఎం రేవంత్‌కు తెలిసే ఇదంతా జరిగిందా? అంటూ ఆగ్రహం
  • ఉగ్రవాద సంస్థకు నిధుల మంజూరు వెనక మాస్టర్ మైండ్ ఎవరని ప్రశ్నించిన సంజయ్

వచ్చే జనవరిలో వికారాబాద్‌లో జరగనున్న తబ్లీఘీ జమాత్ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇస్లామిక్ సొసైటీ పేరిట పరిగి మండలంలో తబ్లీఘీ జమాత్ నిర్వహించనున్న ఈ మీటింగ్‌లకు రూ.2.45 కోట్లు విడుదల చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతోందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర నిఘా విభాగం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను తుక్డే తుక్డే గ్యాంగ్ ఏం చేయాలనుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రం దివాల తీసిందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తబ్లీఘీ జమాత్ కార్యక్రమానికి నిధులు విడుదల చేయటమేమిటని ప్రశ్నించారు. 

తబ్లీఘీ జమాత్ టెర్రరిజంను ప్రోత్సహిస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. సౌదీ అరేబియా, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, కజకస్థాన్ వంటి దేశాలు తబ్లీఘీని నిషేధించాయని గుర్తు చేశారు. 2020లో భారత్‌లో కరోనా వ్యాప్తికి ఈ సంస్థ నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమాలు ప్రధాన కారణమని ఆరోపించారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో రాష్ట్రంలోకి తబ్లీఘీ జమాత్.. మీటింగుల పేరిట కాలుపెట్టడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. తీవ్రవాద భావజాల వ్యాప్తి, బలవంతపు మతమార్పిడులకు కారణమవుతున్న సంస్థకు ప్రభుత్వ నిధులు అందడం వెనుక మాస్టర్ మైండ్ ఎవరని ప్రశ్నించారు. తబ్లీఘీ జమాత్‌పై తక్షణం చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వ ఆదేశాల తాలూకు ఫొటోను కూడా పంచుకున్నారు.

Tablighi Jamaat
Bandi Sanjay
BJP
Revanth Reddy
Congress
Vikarabad District

More Telugu News