Miyapur Waterfall: మియాపూర్‌లో నడిరోడ్డుపై 'జలపాతం'.. వీడియో షేర్ చేసి ప్రభుత్వంపై విరుచుకుపడిన కాంగ్రెస్!

Congress Fires On Miyapur Waterfall

  • నడిరోడ్డుపై పగిలిన పైప్‌లైన్
  • మియాపూర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • ప్రజాధనమంటే లెక్కలేకుండా పోయిందంటూ కాంగ్రెస్ ఫైర్

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకున్నాయి. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టుకు వేసిన రంగులు కూడా వెలిసిపోకముందే కుంగడం, పిల్లర్లు బీటలు వారడాన్ని తీవ్రంగా పరిగణించాయి. ఈ ప్రాజెక్టుతో ఎప్పటికైనా ముప్పేనంటూ కాంగ్రెస్, బీజేపీ ముప్పేట దాడి ప్రారంభించాయి. 

ప్రాజెక్టులపై ప్రతిపక్షాల రచ్చ కొనసాగుతుండగానే సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అయింది. హైదరాబాద్ శివారులోని మియాపూర్‌లో ఓ పైప్‌లైన్ పగిలి నీరు అంతెత్తున ఎగజిమ్ముతోంది. చూడ్డానికి జలపాతంలా ఉన్న ఈ వీడియోను ఓ ఎక్స్ యూజర్ తన ఖాతాలో షేర్ చేశాడు. ‘మియాపూర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్’ అని దానికి క్యాప్షన్ తగిలించాడు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ వీడియో తన ఎక్స్ ఖాతాలో రీట్వీట్ చేస్తూ ప్రభుత్వంపై మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కట్టిన నాలుగేండ్లకే ప్రాజెక్టులు కుంగుతాయని, వేసిన పైపులైన్లు ఐదేండ్లకే పగులుతాయని విరుచుకుపడింది. ప్రజాధనమంటే లెక్కలేకుండా పోయిందని, పాలనలో చిత్తశుద్ధి, పనుల్లో నాణ్యత లేవని విమర్శించింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఇష్టం లేదని, ప్రజా సంక్షేమమంటే పట్టింపే లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Miyapur Waterfall
Miyapur
Hyderabad
Congress
Miyapur Lift Irrigation

More Telugu News