KTR: కేంద్రాన్ని 10 సార్లు అడిగినా ప్రయోజనం లేకపోయింది: కేటీఆర్

KTR fires on Congress and BJP

  • ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటిపోయామన్న కేటీఆర్
  • కాంగ్రెస్ నేతలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా
  • విపక్షాల మాటలు విని ఆగం కావొద్దని ఓటర్లకు సూచన

ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్ దాటేసిందని... కాంగ్రెస్, బీజేపీలతో ఈ ఘనత సాధించగలమా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అద్భుత నగరంగా మారిందని అన్నారు. హైదరాబాద్ కు ఏం చేశారో చెప్పకుండా కాంగ్రెస్ నేతలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్ రోడ్లను వెడల్పు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని 10 సార్లు అడిగినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని విమర్శించారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మళ్లీ చీకటి రోజులు వస్తాయని కేటీఆర్ అన్నారు. ధరణిని రద్దు చేసి, పట్వారీ వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసని అన్నారు. ఎవరి చేతుల్లో రాష్ట్రం సురక్షితంగా ఉంటుందో ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. ఎన్నికలు అనగానే ఒక పార్టీకి కులం, మరో పార్టీకి మతం గుర్తుకొస్తాయని... వాళ్ల మాటలు విని ఆగం కావొద్దని అన్నారు. 

ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో యువతను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. తొమ్మిదిన్నరేళ్లలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించామని... వాటిలో 2,02,735 ఉద్యోగాలను నోటిఫై చేసి... 1,60,083 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. మిగిలిన ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

  • Loading...

More Telugu News