Chandrababu: రాజకీయ కార్యకలాపాలను చక్కబెట్టే పనిలో చంద్రబాబు ఫుల్ బిజీ: వైసీపీ తీవ్ర విమర్శలు

Chandrababu is full busy with politics says YSRCP

  • పవన్ తో 3 గంటల సేపు చర్చలు జరిపారని విమర్శ
  • బెయిల్ తీసుకుంది వైద్యం కోసమా? లేక రాజకీయాలు చేసేందుకా? అని ప్రశ్న
  • బెయిల్ కోసం చెప్పిన ఆరోగ్య సమస్యలు ఇప్పుడు నయమైపోయాయా? అని ఎద్దేవా  

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. రాజకీయ కార్యకలాపాలను చక్కబెట్టే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారంటూ విమర్శించింది. వైద్యం కోసం మధ్యంతర బెయిల్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు... ఇదే పనిలో ఉన్నారని దుయ్యబట్టింది. 

జైల్లో చంద్రబాబు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ టీడీపీ అండ్ కో పెద్ద కలరింగ్ ఇచ్చిందని తెలిపింది. రాజమండ్రి నుంచి ఉండవల్లిలోని నివాసానికి 14 గంటలు కారులో ప్రయాణించిన బాబు... హైదరాబాద్ లో జనసేనాని పవన్ కల్యాణ్ తో దాదాపు 2 నుంచి 3 గంటల సేపు రాజకీయ చర్చలు జరిపారని విమర్శించింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఇవన్నీ చేయగలరా? అని ప్రశ్నించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించింది. 

చంద్రబాబు బెయిల్ తీసుకుంది వైద్యం కోసమా? లేక రాజకీయాలు చేసేందుకా? అని వైసీపీ ప్రశ్నించింది. బెయిల్ కోసం చెప్పిన ఆరోగ్య సమస్యలు ఇప్పుడు నయమైపోయాయా? అని ఎద్దేవా చేసింది. వైద్యం కోసమే అయితే జైలు నుంచి విడుదల రోజున రాజకీయ ర్యాలీలు ఎందుకని ప్రశ్నించింది. హైదరాబాద్ లో రాజకీయ మంతనాల కోసమే బెయిల్ తీసుకున్నారా? అని నిలదీసింది.

  • Loading...

More Telugu News