Hyderabad: చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్, ఆయన కొడుకుపై కేసు నమోదు

A case has been registered against Charminar MLA Mumtaz and his son

  • ఎన్నికల నియమావళి ఉల్లంఘించి శనివారం అర్థరాత్రి ర్యాలీ
  • అనుమతి లేకుండా నిర్వహించడంతో సుమోటోగా కేసు
  • పోలీసులు అకారణంగా తమను వేధిస్తున్నారంటున్న ఎమ్మెల్యే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా కొనసాగుతున్న వేళ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌పై కేసు నమోదయ్యింది. ఎన్నికల నియమావళిని అతిక్రమించి అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టడంతో ఈ కేసు నమోదయ్యింది. మొఘల్‌పుర పోలీసులు ఆదివారం సుమోటోగా ఈ కేసు నమోదు చేశారు. ముంతాజ్‌తోపాటు ఆయన కొడుకు ఇంతియాజ్‌పై కూడా కేసు నమోదయ్యింది.

కాగా పోలీసులు తమను కారణం లేకుండా ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే ముంతాజ్, ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఎమ్మెల్యే, అతని కొడుకు దాదాపు 200 మంది అనుచరులను వెంటబెట్టుకొని ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీ ఆఫీస్ నుంచి మీరాలం మండి, బీబీబజార్‌ చౌరస్తా, మొఘల్‌పుర వాల్టా హోటల్‌, మొఘల్‌పుర వాటర్‌ ట్యాంకు మీదుగా హుస్సేనీఆలం వరకు ఈ ర్యాలీ కొనసాగించారు. దీనిని సుమోటోగా స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్‌ కొనసాగుతున్న సమయంలో రిటర్నింగ్‌ అధికారి అనుమతి పొందకుండా ర్యాలీ చేపట్టడం ఈ కేసు నమోదు చేయడానికి కారణంగా ఉంది. తండ్రీకొడుకులతోపాటు మరికొందరిపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఒక కేసు విషయంలో ఎమ్మెల్యే ఇంతియాజ్‌ను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News