Etela Rajender: చంద్రబాబుపై ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన తెలుగుదేశం

TeluguDesam responds on Etala Rajender comments on chandrababu

  • తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెడుతున్నారన్న ఈటల
  • ఈటల రాజేందర్ వ్యాఖ్యలు శోచనీయమన్న అర్వింద్ కుమార్ గౌడ్
  • ప్రత్యేక కారణాల వల్ల టీడీపీ తెలంగాణలో పోటీ చేయడం లేదని వెల్లడి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ తెలంగాణ విభాగం ఖండించింది. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెడుతున్నారని ఈటల నిన్న వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ టీడీపీ నేత అర్వింద్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... బీసీ వర్గాలను ప్రోత్సహించిన టీడీపీపై ఈటల వ్యాఖ్యలు శోచనీయమన్నారు. బీజేపీ నేతలు ఎన్టీఆర్ జపం చేయడం లేదా? అని ప్రశ్నించారు.

ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబు జపం చేస్తున్నారన్నారు. ఓట్ల కోసమే కొంతమంది చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని పదేళ్ల క్రితం మొదట ప్రకటన చేసిందే టీడీపీ అని గుర్తు చేశారు. కొన్ని ప్రత్యేక కారణాలవల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు సమయం ఇవ్వలేరనే కారణంతో పోటీ చేయడం లేదన్నారు. బడుగు బలహీన వర్గాలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ అని, సేవాభావంతో పుట్టిన పార్టీ టీడీపీ అన్నారు.

  • Loading...

More Telugu News