TDP: నిజంగానే ఆధారాలు ఉంటే 50 రోజులుగా ఏం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై లోకేశ్ ఫైర్

Nara Lokesh Speech Live

  • చంద్రబాబుపై కేసులకు సంబంధించిన ఆధారాలు ప్రజల ముందు పెట్టాలని డిమాండ్
  • ఇదే శ్రద్దను రైతుల సమస్యలు తీర్చడంలో చూపించాలని ప్రభుత్వానికి హితవు
  • చంద్రబాబును జైలులోనే చంపేస్తామంటున్నారని విమర్శ

చంద్రబాబుపై కేసులకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు.. మరి 50 రోజులుగా వాటిని బయటపెట్టకుండా ఏంచేస్తున్నారని వైసీపీ నేతలపై నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించడం సహజమేనని, అయితే ప్రత్యర్థిని చంపాలని చూడడం వైసీపీ నేతలకే చెల్లిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు జైలులోనే చనిపోతారంటూ వైసీపీ నేతలు చెబుతున్నారని లోకేశ్ గుర్తుచేశారు. కేసులతో ఎలాంటి సంబంధంలేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. స్కాంలతో తమకు కానీ, తమ పార్టీ నేతలకు కానీ, బంధుమిత్రులకు కానీ ఎలాంటి సంబంధంలేదని లోకేశ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఉందని మీ దగ్గర ఏ చిన్న ఆధారం ఉన్నా ప్రజల ముందు పెట్టాలని వైసీపీ నేతలకు లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు.

వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైలులో పెట్టారని లోకేశ్ విమర్శించారు. ప్రజల నుంచి ఆయనను దూరం చేయడానికి, ప్రజా సమస్యలపై పోరాడకుండా అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ఈ నాటకం ఆడుతోందని ఆరోపించారు. అంతే తప్ప చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని లోకేశ్ తెలిపారు. టీడీపీ అధినేతను జైలులోకి పంపడంపై పెట్టిన శ్రద్ధను రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో పెడితే బాగుండేదని అన్నారు. సౌత్ ఇండియాలోనే ఎన్ ఎస్ జీ ప్రొటెక్షన్ కలిగిన ఒకేఒక నేత చంద్రబాబు అని, ఆయనకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉండడంతో కేంద్రం ఈ రక్షణ కల్పించిందని చెప్పారు. అలాంటి వ్యక్తిని అన్యాయంగా జైలులో పెట్టి, సరైన రక్షణ కల్పించకపోవడం చూస్తుంటే తమకు అనుమానంగా ఉందన్నారు. తమ అధినేతను జైలులోనే అంతమొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందేమోనని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.

TDP
Nara Lokesh
Chandrababu
Skill Development Case
Andhra Pradesh
YSRCP
YS Jagan

More Telugu News