Naina Jaiswal: ​సీఎం జగన్ ను కలిసిన ప్రముఖ టీటీ క్రీడాకారిణి నైనా జైస్వాల్

Naina Jaiswal met AP CM Jagan

  • తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన నైనా జైస్వాల్
  • కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ తో భేటీ
  • పిన్న వయసులోనే అపార ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన నైనా

అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఇవాళ ఏపీ సీఎం జగన్ ను కలిసింది. నైనా జైస్వాల్ హైదరాబాద్ నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చింది. సీఎం జగన్ కు ఆమె ఓ వినతి పత్రం సమర్పించినట్టు తెలుస్తోంది. దాని గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. 

కాగా, నైనా జైస్వాల్ ప్రతిభ గురించి తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఆమె ప్రజ్ఞాపాటవాలు టేబుల్ టెన్నిస్ కే పరిమితం కాలేదు. సంభ్రమాశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే... నైనా 8 ఏళ్ల వయసుకే టెన్త్ క్లాస్ పూర్తి చేసింది. 

10వ ఏట ఇంటర్, 13 ఏళ్లకు డిగ్రీ, 16 ఏళ్లకే పీజీ పూర్తి చేసి ఔరా అనిపించింది. ఆ తర్వాత పీహెచ్ డీ కూడా చేసి ఆసియా స్థాయిలో పీహెచ్ డీ అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా ఖ్యాతి పొందింది. రెండు చేతులతో రాయగలగడం, అత్యంత వేగంగా టైపింగ్ చేయడంలోనూ నైనా జైస్వాల్ దిట్ట. ఏడేళ్ల వయసుకే రామాయణ శ్లోకాలు నేర్చుకుంది. 

అంతేకాదు, నైనా చక్కగా పాటలు పాడుతుంది, పియానో కూడా వాయిస్తుంది. ఆమె మోటివేషనల్ స్పీకర్ కూడా. ప్రస్తుతం నైనా వయసు 23 ఏళ్లు. తల్లితో కలిసి న్యాయవాద కోర్సులో చేరిన నైనా ఇటీవలే అడ్వొకేట్ గానూ ప్రమాణం చేసింది.

  • Loading...

More Telugu News