Nara Lokesh: ఈ మాత్రం దానికి ఒక రోజంతా టైమ్ వేస్ట్ చేశారు: నారా లోకేశ్

Nara Lokesh press meet after CID questioning

  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ పై ఆరోపణలు
  • నేడు సిట్ ఎదుట విచారణకు హాజరైన లోకేశ్
  • 50 ప్రశ్నలు అడిగితే అందులో రింగురోడ్డుకు సంబంధించి ఒక్కటే ప్రశ్న ఉందని వెల్లడి
  • దొంగ ఎఫ్ఐఆర్ లు రూపొందిస్తూ  ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆగ్రహం

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. తాడేపల్లి సిట్ కార్యాలయంలో సీఐడీ విచారణ ముగిసిన అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. 

తనను 50 ప్రశ్నలు అడిగినా, అందులో ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన ప్రశ్న ఒక్కటి మాత్రమే ఉందన్నారు. మంత్రినయ్యాక భూముల లే అవుట్ పై ఇచ్చిన ఓ జీవో గురించి తప్ప ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి ప్రశ్నలు అడగలేదని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో మేం అవినీతికి పాల్పడ్డామని గానీ, మా కుటుంబం లబ్ది పొందింది అని గానీ ఎలాంటి ఆధారాలను సీఐడీ వాళ్లు నా ముందు పెట్టలేదు అని లోకేశ్ వివరించారు. తమను అడ్డుకునేందుకు దొంగ ఎఫ్ఐఆర్ లు రూపొందిస్తూ ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. 

"ఈ కేసుకు సంబంధించి ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయని దర్యాప్తు అధికారి నాతో చెప్పారు. రేపు నేను చాలా బిజీ... ఆ ప్రశ్నలేవో ఇప్పుడే అడగండి... ఎంత సమయం అయినా ఉంటాను అని బదులిచ్చాను. కానీ సీఐడీ అధికారులు అందుకు అంగీకరించలేదు. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ అక్కడికక్కడే నోటీసులు ఇచ్చారు" అని లోకేశ్ వెల్లడించారు. 

నేను మాట్లాడడం అయిపోయింది... మీడియా మిత్రులు ఏవైనా ప్రశ్నలు అడగొచ్చని లోకేశ్ పేర్కొనగా, ఓ రిపోర్టర్ స్పందించారు. సిట్ కార్యాలయంలో సీఐడీ అధికారుల ప్రశ్నలకు లోకేశ్ నీళ్లు నమిలారంటూ కొన్ని టీవీ చానళ్లలో వార్తలు ప్రసారమయ్యాయి అని ఆ రిపోర్టర్ అడిగారు. వెంటనే బదులిచ్చిన లోకేశ్... తనముందున్న మూడు టీవీ చానల్ మైక్ లు (టీవీ9, ఎన్టీవీ, సాక్షి) అందుకుని వీళ్లు తప్ప ఇంకెవరైనా ఆ వార్తను ప్రసారం చేసి ఉంటే చెప్పండి అని తిరిగి ప్రశ్నించారు. దాంతో అక్కడున్న అందరూ నవ్వేశారు. 

విచారణ ముగిశాక దర్యాప్తు అధికారి... థాంక్యూ ఫర్ కోఆపరేటింగ్ అన్నారు... దానర్థం విచారణకు సహకరించాననే కదా... వారడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను కాబట్టే ఆయన ఆ మాట అన్నారు కదా అని లోకేశ్ వివరించారు. మధ్యలో ఏదైనా టాయిలెట్ బ్రేక్, బయో బ్రేక్ ఏవైనా కావాలా అన్నారు... ఫర్వాలేదు అన్నింటికీ సమాధానం చెబుతానని రిప్లయ్ ఇచ్చాను... ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి బ్రదర్? అని పేర్కొన్నారు. 

ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మేం చేసిన నేరమా... అందుకే ఇలాంటి కేసుల్లో మమ్మల్ని పిలిచి ఇలా ఒకరోజంతా వేస్ట్ చేస్తారు అని లోకేశ్ కామెంట్ చేశారు. లేకపోతే యువగళం పాదయాత్ర చేసుకుంటూ ఉండేవాడిని... దొంగ కేసులు పెట్టారు కాబట్టే ఇలా బ్రేక్ వచ్చింది అని తెలిపారు. 

చంద్రబాబు అరెస్ట్ తో తనకు సంబంధం లేదని సీఎం జగన్ పేర్కొన్నారంటూ ఓ మీడియా ప్రతినిధి లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. అందుకు లోకేశ్ స్పందిస్తూ... సీఐడీ ముఖ్యమంత్రి కింద పనిచేస్తోందా, లేదా... ఏసీబీ ఎవరికి రిపోర్టు చేస్తుంది? సహజంగానే ముఖ్యమంత్రి గారికి కొంచెం అవగాహన తక్కువ... ఆయనను డీజీ వద్ద పాఠాలు చెప్పించుకోమనండి అంటూ లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు.

Nara Lokesh
Press Meet
CID
Inner Ring Road Case
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News