Andhra Pradesh: చరిత్రలో కనీవినీ ఎరగని అభివృద్ధి చేశాం.. 'ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమంలో సీఎం

AP Cm jagan Speech At YSRCP Meeting In Vijayawada
  • అధికారాన్ని ఓ బాధ్యతగా.. ప్రజలకు సేవ చేసే అవకాశంగా తీసుకున్నామని వ్యాఖ్య
  • మూడు ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మూడు రాజధానుల నిర్ణయం
  • విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో 52 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు
ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పరుగులు పెడుతోందని, చరిత్రలో కనీవినీ ఎరగని అభివృద్ధిని ఈ 52 నెలల పాలనలోనే చేసి చూపించామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. జగన్ మాట ఇస్తే తప్పడనే పేరు సంపాదించుకున్నానని ఆయన వివరించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ వైసీపీ తప్ప మరొకటి లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదని జగనన్న సురక్ష పథకం తీసుకొచ్చామని తెలిపారు. ఈ పథకం కింద 15 వేల హెల్త్ క్యాంపులను నిర్వహిస్తూ, 1.65 కోట్ల ఇళ్లను కవర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు విజయవాడలో జరుగుతున్న వైసీపీ ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ ప్రసంగించారు.

సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్యాయం చేశామని సీఎం జగన్ తెలిపారు. మూడు ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా, ఓ బాధ్యతగా అధికారాన్ని చేపట్టామని జగన్ వివరించారు. ప్రజలకు తొలి సేవకుడిగా పాలన అందిస్తున్నాం కాబట్టే ఈ 52 నెలల కాలం చరిత్రలో నిలిచేలా మారిందని వివరించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ‘ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని వచ్చే నెల 1 నుంచి డిసెంబర్ 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని సీఎం జగన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
Andhra Pradesh
CM Jagan
YSRCP
Vijayawada

More Telugu News