నా వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించింది: ఉదయనిధి స్టాలిన్
- ప్రధాని మోదీ తొమ్మిదేళ్లుగా గాలి మాటలతో మభ్యపెడుతున్నారని విమర్శ
- డీఎంకే ఏ మతానికి వ్యతిరేకం కాదని వ్యాఖ్య
- తనపై నమోదైన కేసులను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని వెల్లడి
తన తల తెస్తే రూ.10 కోట్లు ఇస్తానన్న అయోధ్య స్వామిసహా తనను హెచ్చరించిన వారి గురించి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. తన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఆజ్యం పోశారన్నారు. తప్పుడు మాటలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఉదయనిధి డిమాండ్ చేశారు. అందరూ సమానమే అనే సూత్రాన్ని బోధించే అన్ని మతాలను గౌరవిస్తామన్నారు. మణిపూర్ సమస్య, కాగ్ నివేదిక, అదానీ వంటి అంశాల నుండి దృష్టి మళ్లించే ప్రయత్నమిదన్నారు. తనను విమర్శించే మత పెద్దలపై కేసులు పెట్టి, వారి దిష్టిబొమ్మలు దగ్ధం చేసే పని చేయవద్దని ఉదయనిధి పార్టీ కార్యకర్తలను కోరారు.
తన వ్యాఖ్యలను బీజేపీ వారు తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. మేం డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై వారసులమని, తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని అందరికీ తెలుసునని చెప్పారు. తానూ ఆధ్యాత్మికవాదినేనని చెప్పారు. ఒకవేళ ఏదైనా మతం వర్గాల పేరిట ప్రజలను విభజిస్తే, అంటరానితనం, బానిసత్వాన్ని బోధిస్తే అలాంటి మతాన్ని వ్యతిరేకించే వారిలో ముందు ఉంటానని అన్నాదురై చెప్పారని గుర్తు చేశారు. అందరూ సమానత్వంతో జన్మించారని బోధించే అన్ని మతాలను డీఎంకే గౌరవిస్తుందన్నారు.