Chandrababu: విజన్ 2020తో సాధించిన ఫలితాలు కళ్లముందే ఉన్నాయ్... అందుకే విజన్ 2047: చంద్రబాబు

Chandrababu Naidu in Hyderabad IIIT silver jubilee fest

  • అభివృద్ధి ఫలాలు అందరికీ చేరితేనే తనకు సంతృప్తి అన్న మాజీ సీఎం 
  • విజన్ ఇచ్చే ఫలితాలకు నేటి హైదరాబాద్ సాక్ష్యమని వెల్లడి
  • స్మార్ట్ సిటీలతో పాటు.. స్మార్ట్ విలేజ్‌లు కూడా రావాలన్న చంద్రబాబు
  • దేశ రాజధానిని కూడా హైదరాబాద్ తీసుకెళ్లేలా ఉన్నావని వాజపేయి అన్నారని వెల్లడి
  • హైదరాబాద్ ట్రిపుల్ ఐటి సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో నారా చంద్రబాబునాయుడు

విజన్‌తో తీసుకున్న నిర్ణయాలు, పాలసీలతో వచ్చిన ఫలితాలు నేడు కళ్లముందు కనిపిస్తున్నాయని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజన్ ఇచ్చే ఫలితాలకు నేటి హైదరాబాద్ సాక్ష్యం అన్నారు. ఈ రోజు తెలంగాణ దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా ఆవిర్భవించడానికి నాడు ఇక్కడ జరిగిన అభివృద్దే కారణమన్నారు. ఎన్నికల్లో గెలవడం వేరు.. అభివృద్ది చేయడం వేరు అని చెప్పారు. నాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ది చేశామన్నారు. కానీ 2004 ఎన్నికల్లో తాము ఓడిపోయామన్నారు. అందుకే అభివృద్దిని ఎన్నికల ఫలితాలను పోల్చి చూడనన్నారు. IIT హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా క్యాంపస్ లో నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ప్రజలకు అభివృద్ది ఫలాలు చేరడం తనకు అత్యంత సంతృప్తినిస్తుందన్నారు.

దేశంలో స్మార్ట్ సిటీలతో పాటు... స్మార్ట్ విలేజ్‌లు కూడా రావాలనేదే తన అభిమతమన్నారు. నాడు రాష్ట్రం కోసం అనేక అంశాల్లో ప్రధాని వాజ్ పేయిపై ఒత్తిడి తెచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు. నిన్ను చూస్తుంటే దేశ రాజధానిని కూడా హైదరాబాద్ తీసుకువెళ్లేలా ఉన్నావని ఆనాడు వాజ్ పేయి తనను అన్నారని చెప్పారు. ఐటీ అనేది నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ అవుతుందని నాడే గుర్తించానన్నారు. ఇందులో భాగంగానే ఐటీ సంస్థలను ప్రోత్సహించామని, ఐటీ సంస్థల్లో పని చేయడానికి ఐఐఐటీ వంటి సంస్థలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీను అందుబాటులోకి తెచ్చానని, దీంతో నిపుణుల లభ్యత పెరిగిందన్నారు. ISB, IIIT, నల్సార్ వంటి సంస్థల తీసుకువచ్చామన్నారు. రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు, రెగ్యులర్ ఇంజనీరింగ్ కాకుండా సంస్థలకు కావాల్సిన నిపుణులను తయారు చేయడానికి ఈ సంస్థలను తీసుకు వచ్చామన్నారు. ట్రిపుల్ ఐటీ ఆవిర్భావం సందర్భంగా సీఎం హోదాలో తనను చైర్మన్‌గా ఉండమన్నారని, కానీ ఆ రంగనిపుణులు దానికి హెడ్ గా ఉండడమే కరెక్ట్ అని తాను చెప్పానన్నారు.

రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదని, ఇలాంటి సంస్థలకు తాము అధిపతులుగా ఉండకూడదని చెప్పానని చంద్రబాబు నాటి అనుభవాలను పంచుకున్నారు. నాడు నేను స్థాపించిన ఈ ట్రిపుల్ ఐటి టాప్ 10 సంస్థల్లో స్థానం పొందడం పట్ల తాను గర్విస్తున్నానన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థను హైదరాబాద్ తీసుకువచ్చామనట్లు చెప్పారు. మైక్రోసాఫ్ట్ వస్తే అన్ని సంస్థలు వస్తాయని గ్రహించి, అందుకోసమే బిల్ గేట్స్‌ను  ప్రజెంటేషన్ ద్వారా మెప్పించి మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చానన్నారు. మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ను పెట్టాలని గట్టిగా కోరానని, భారతీయులకు ఐటీలో ఉన్న నైపుణ్యం వివరించానని, మూడు నాలుగు సమావేశాల తర్వాత బిల్ గేట్స్ హైదరాబాద్‌లో మైక్రో సాఫ్ట్ సెంటర్ పెట్టారన్నారు. దీంతో హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు వరసకట్టాయన్నారు.

తాను హైదరాబాద్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, కానీ 2004 ఎన్నికల్లో తాము ఎన్నికల్లో ఓడిపోయామని, ఎన్నికల్లో గెలవడం వేరు.. అభివృద్ది, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించడం వేరు అన్నారు. ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, సంస్థల ఏర్పాటు అనేది అంత ఈజీగా జరగలేదని, అవి ఎలా వచ్చాయో, ఎవరు తెచ్చారనేది ఇప్పుడు ఎవరికి తెలియకపోవచ్చు.. కానీ ప్రజలకు ఉపయోగపడుతున్న విధానం తనకు సంతృప్తినిస్తుందన్నారు. అది తన మనసుకు ఆనందాన్ని ఇస్తుందన్నారు. నాడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి సంస్థలు తెచ్చానన్నారు.

మీరు నాకు డబ్బు ఇవ్వాల్సిన పని లేదు.. కానీ పాలసీలు తీసుకురండి అని మాత్రమే నాడు కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. ఆ పాలసీల ద్వారా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వంటి సంస్థలను తీసుకువచ్చానని, అనేక సవాళ్లను ఎదుర్కొని నాడు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు తెచ్చానన్నారు. పీపీపీ విధానంలో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశానని చెప్పారు. నాడు జీనోం వ్యాలీ తన హయాంలోనే ఏర్పాటయిందన్నారు. ఇప్పుడు కరోనాకు దాని నుంచే వ్యాక్సిన్ వచ్చిందన్నారు. ISBని హైదరాబాద్ కు తీసుకురావడానికి చాలా శ్రమించినట్లు చెప్పారు. అత్యుత్తమ ప్రభుత్వ పాలసీల వల్లనే నాడు ISB హైదరాబాద్ వచ్చిందన్నారు.

 ఫార్మా ఎక్స్ పోర్ట్ కౌన్సిల్ కూడా గట్టి ప్రయత్నం ద్వారా హైదరాబాద్‌కు వచ్చిందన్నారు. విజన్ తో అద్భుత ఫలితాలు సాధించవచ్చునని, అందుకే విజన్ 2047 ను ప్రతిపాదించానన్నారు. విజన్ 2020 ద్వారా 20 ఏళ్లలో సాధించిన ఫలితాలు మన కళ్లముందు కనిపిస్తున్నాయన్నారు. భారత దేశానికి ఉన్న యవశక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఇతర దేశాలకంటే మనకు ఉన్న ఉన్న సౌలభ్యం, బలం... శక్తివంతమైన యువత ఉండటమే అన్నారు. దీనిని ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

2002లో జరిగిన జాతీయ క్రీడలకు ప్రత్యేక క్రీడా గ్రామాలు నిర్మించామన్నారు. తర్వాత ఆఫ్రో ఏషియన్ గేమ్స్ వచ్చాయని, ఇక్కడ చేసిన మౌళిక సదుపాయాల వల్ల సమర్థవంతంగా క్రీడలు నిర్వహించామన్నారు. ఒలంపిక్ క్రీడలు కూడా నిర్వహించే సమర్థత దేశానికి ఉందని నేను నమ్ముతానని, అదే విషయం నాడు చెప్పానని తెలిపారు. రెస్ట్, ఫుడ్, వర్క్ ను సమన్వయం చేసుకోవడం ద్వారా మంచి జీవితాన్ని పొందవచ్చునని, అందుకే న్యూట్రిఫుల్ అనే యాప్ ను సిద్దం చేశామన్నారు. దీని నుంచి 80 వేల మంది సేవలు పొందుతున్నారని తెలిపారు. దీనిని మరింత విస్తరిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఫ్యాకల్టీ అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చెప్పారు. ఇక్కడ చదువుకుంటున్న వారంతా ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలని, తద్వారా ప్రజలకు తక్కువ ఖర్చుతో సేవలు అందించే వీలు ఉంటుందన్నారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీని ఉత్తమమైన సంస్థగా నడుపుతున్న యాజమాన్యానికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. సమావేశానికి ప్రొఫెసర్ రాజిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.

  • Loading...

More Telugu News