Revanth Reddy: కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షను నీరుగార్చేందుకే ఉచిత విద్యుత్ రాద్ధాంతం: రేవంత్

Revanth Reddy says BRS is BJPs B team

  • రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నామన్న రేవంత్
  • బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అని మరోసారి తేలిందని విమర్శ
  • అన్ని మండలాల సబ్ స్టేషన్ల వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని పిలుపు

తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా తాము బుధవారం సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నామని, దీనిని నీరుగార్చేందుకు బీఆర్ఎస్ ఉచిత విద్యుత్ అంశంతో రాద్ధాంతం చేస్తూ కుట్రకు తెరలేపిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అని దీనిని బట్టి మరోసారి తేలిపోయిందన్నారు. తానా సభల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన పీసీసీ చీఫ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ లో స్పందించారు. సత్యాగ్రహ దీక్షని నీరుగార్చడానికి బీఆర్ఎస్ ఉచిత విద్యుత్ అంశాన్ని తెరపైకి తెచ్చి, దృష్టి మరలించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. 

బీఆర్ఎస్ 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తోందన్నారు. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయాన్ని ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను రూ.60 వేల కోట్ల అప్పుల్లో ముంచి, తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోసాలకు నిరసనగా రాష్టవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని సబ్ స్టేషన్ల వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News