Nalgonda District: జల్సాలకు అలవాటుపడిన భర్త.. రూ. 5 లక్షల సుపారీ ఇచ్చి చంపించిన భార్య

Wife Gave Rs 5 Lakhs To Kill Her Husband

  • నల్గొండ జిల్లా దేవరకొండలో ఘటన
  • స్నేహితురాలి భర్తతో రూ. 5 లక్షలకు ఒప్పందం
  • గత నెల 26న నోట్లో సైనైడ్ పోసి హత్య

జల్సాలకు అలవాటుపడి అప్పులు చేస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న భర్తను నిర్దాక్షిణ్యంగా అడ్డుతొలగించుకుందో భార్య. రూ. 5 లక్షలు ఖర్చు చేసి మరీ భర్తను హత్య చేయించింది. నివ్వెరపరిచే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన రఘురాములు స్టాంప్ వెండర్‌గా పనిచేస్తూనే ఓ కిడ్స్‌వేర్ దుకాణం నడుపుతున్నాడు. దీనిని భార్య శ్రీలక్ష్మి చూసుకునేది. 

మరోపక్క, జల్సాలకు అలవాటు పడిన రఘురాములు అప్పులు చేస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. చెడు అలవాట్లు మానుకోమని ఎంతగా నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని శ్రీలక్ష్మి ఓ నిర్ణయానికి వచ్చింది.

హైదరాబాద్‌లో ఉంటున్న స్నేహితురాలి భర్త చిలకరాజు అరుణ్‌తో పరిచయం పెంచుకుని భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఇందుకోసం రూ. 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో రెండుసార్లు రఘురాములు హత్యకు ప్లాన్ చేసినా వెనకడుగు వేశారు. జూన్ 26న మరోమారు ప్లాన్ చేసి హత్య చేశారు. హైదరాబాద్ సంతోష్‌నగర్‌కు చెందిన పెనుగొండ రవితేజ, మరో మహిళతో దేవరకొండ చేరుకున్న అరుణ్ డబ్బుల కోసం రఘురాములుకు ఫోన్ చేసి మిషన్ కాంపౌండ్‌కు పిలిపించాడు. 

అక్కడ అతడిపై దాడిచేసి నోట్లో, ముక్కులో సైనైడ్ పోసి హత్య చేశాడు. అనంతరం కారులో హైదరాబాద్‌కు పారిపోతూ రాత్రి 10 గంటల సమయంలో రఘురాములను చంపేసినట్టు శ్రీలక్ష్మికి ఇన్‌స్టాగ్రాం ద్వారా ఫోన్ చేసి చెప్పాడు. రఘురాములు హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో అతడి భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నిర్ధారించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Nalgonda District
Devarakonda
Supari Killing
Crime News
  • Loading...

More Telugu News