Revanth Reddy: తెలంగాణలో కర్ణాటక ఫార్ములాతో అధికారంలోకి: రేవంత్ రెడ్డి

Revanth Reddy says Congress will apply Karnataka formula in telangana

  • ఎన్నికలకు ఎలా ముందుకు సాగాలనే అంశంపై చర్చించినట్లు వెల్లడి
  • తెలంగాణలో కేసీఆర్ పాలనలో అవినీతి పేట్రేగిపోయిందని ఆరోపణ
  • ముఖ్య నాయకులం కలిసి బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు సన్నద్ధులమవుతామని వ్యాఖ్య

120 రోజుల్లో జరగనున్న ఎన్నికలకు ఎలా ముందుకు సాగాలనే అంశంపై తాము చర్చించామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో పార్టీ జాతీయ నాయకులతో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ భేటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సాధారణ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగిందన్నారు. పదేళ్ల టీఆర్ఎస్ వైఫల్యాలను, కేంద్రంలోని మోదీ అధికార దుర్వినియోగాన్ని ప్రజలకు ఎలా వివరించాలో ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు.

తెలంగాణలో కేసీఆర్ పాలనలో అవినీతి పేట్రేగిపోయిందన్నారు. అవినీతి ఆకాశానికి పొంగితే, అభివృద్ధి పాతాళంలో ఉందనే విషయాన్ని ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఏ కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించినట్లు చెప్పారు. ముఖ్య నాయకులం కలిసి బీఆర్ఎస్ ను గద్దె దించడానికి పూర్తిస్థాయిలో సన్నద్ధులమై సాగుతామన్నారు.

తెలంగాణ ఎన్నికల కార్యాచరణ మొదలైందన్నారు. ఈ సన్నాహక సమావేశం ద్వారా తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలకు స్పష్టంగా కాంగ్రెస్ ఎన్నికల కార్యాచరణను ప్రారంభించినట్లు చెప్పారు. రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ తమ అనుభవాలను తమకు చెప్పారన్నారు. కర్ణాటకలో ఏ ఫార్ములాతో కాంగ్రెస్ ఎన్నికలను ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో, అలాంటి కార్యాచరణతో తెలంగాణలో ముందుకు సాగుతామన్నారు. కర్ణాటకలో పాటించిన కొన్ని మౌలికసూత్రాలను తెలంగాణలోను పాటిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వస్తామన్నారు.

  • Loading...

More Telugu News