BRS: తెలంగాణ, మహారాష్ట్రలో బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పని చేస్తోంది: ఠాక్రే

BRS working for BJP in Telangana and Maharashtra

  • ఎన్నికలు టార్గెట్ గా ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశమని వెల్లడి
  • తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ లూఠీ చేశారని వ్యాఖ్య
  • దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపణ

తెలంగాణ ఎన్నికల టార్గెట్ గానే నేటి సమావేశం జరిగిందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. ఢిల్లీలో పార్టీ జాతీయ నాయకులతో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ భేటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును లూఠీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తెలంగాణలో ఏఏ అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. తెలంగాణలో పరిస్థితులపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించారని, కానీ సామాన్య ప్రజల ఆశయాలు, ఉద్యమ లక్ష్యాలు నెరవేరలేదన్నారు.

తెలంగాణ ప్రజలు దోపిడీకి గురవుతున్నారని వాపోయారు. బీఆర్ఎస్ పాలన పట్ల తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నాలు సాగుతున్నాయని మండిపడ్డారు. మహారాష్ట్ర, తెలంగాణలో బీఆర్ఎస్.. బీజేపీతో కలిసి పని చేస్తోందని ఆరోపించారు. 


  • Loading...

More Telugu News